హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): మహిళా సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీ)లను ఏర్పాటుచేసి వారికి రుణ సదుపాయం కల్పించడంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉన్నది. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో 36.36 లక్షల మందికి రూ.14,451 కోట్లు రుణాలుగా ఇచ్చారు. మహిళలకు స్వయం ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్, పట్టణ ప్రాంతాలలో మెప్మా ద్వారా రుణాలు అందిస్తున్నారు. 2019-20లో ఎస్హెచ్జీలకు రూ.10వేల కోట్లు రుణాలు ఇచ్చారు. 2020-21లో రూ.4 వేల కోట్లకు పైగా పెరిగాయి. సెర్ప్ ద్వారా 2.72 లక్షల గ్రూపులకు రూ.10,267 కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ అది రూ.10,441 కోట్లకు చేరింది. మెప్మా ద్వారా 37,390 సంఘాలకు రూ.1249 కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, అది రూ.1,630 కోట్లకు చేరింది.
ఇక స్త్రీ నిధి ద్వారా 1,58,679 గ్రూపులలోని 5,36,311 మంది సభ్యులకు రూ.2,380 కోట్ల రుణాలు ఇచ్చారు. ఎస్హెచ్జీలకు ఇస్తున్న రుణాల్లో 98 శాతం రికరవరీ అవుతున్నది. దీంతో బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. ఈ రుణాలకు వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఇందుకోసం బడ్జెట్లో రూ.3వేల కోట్లు కేటాయించింది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో గ్రూపులోని ఒక్కో సభ్యురాలికి రూ.2వేలు రుణం ఇవ్వగా, ప్రస్తుతం సగటున రూ.80వేల వరకు ఇస్తున్నారు. ఒక్కో గ్రూపునకు సగటున రూ.5 లక్షల వరకు రుణం ఇస్తున్నారు. మహిళలు, సంఘాలు తాము తీసుకుంటున్న రుణాల్లో 90 శాతం వరకు ఉత్పాదక రంగాలు ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడి పెడుతున్నారు. పాడిపరిశ్రమ, కులవృత్తులు, వ్యాపారాల కోసం వాటిని ఖర్చు చేస్తున్నారు.
ఇవీ కూడా చదవండి…
ఎంటర్ప్రైజెస్గా ఎస్హెచ్జీ మహిళలు
సాయిబాబా తొలగింపు సరికాదు: కేకే
కల్వకుర్తి కాలువలకు పాలమూరు నీళ్లు