50 వేల మందికి శిక్షణ, రుణాలు ఇప్పించనున్న సెర్ప్
హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళలను ఎంటర్ప్రైజెస్గా తయారుచేయడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి ఉత్సాహం, ఆసక్తి ఉన్న కనీసం ముగ్గురిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 12,750 గ్రామాల నుంచి దాదాపు 50 వేల మందిని అధికారులు ఎంపిక చేయనున్నారు. వీరికి శిక్షణ ఇవ్వడమే కాకుండా, వారికి ఉపాధి కల్పించడానికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించనున్నారు. ఒకవేళ ఎక్కువ మొత్తంలో రుణం అవసరముంటే ముద్ర రుణాలను కూడా అందించాలని నిర్ణయించారు. మహిళలను ఎంటర్ప్రైజెస్గా తయారుచేయడానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు కూరగాయలు, పండ్ల దుకాణం, టైలర్ షాపు, పిండి గిర్ని, పాల షాపు ఇలా చిన్నచిన్న వ్యాపారాలు మాత్రమే చేస్తున్నారు. వీటికి భిన్నంగా మార్కెట్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిల్లో వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. సెర్ప్ ప్రారంభమై రెండు దశాబ్దలైన నేపథ్యంలో సంఘాలను మరింత బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.