హైదరాబాద్ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. వివిధ సేవల ద్వారా రూ.1,16,13,977 ఆదాయం వచ్చింది. ఇంత మొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి ఆలయ అధికారులు తెలిపారు. గతవారం సైతం ఒకే రోజు రూ.కోటికిపైగా ఆదాయం రావడం విశేషం. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో హైదరాబాద్ జంటనగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తరలివచ్చారు.
సుమారు 80వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అంచనా. ధర్మదర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. పెద్ద సంఖ్యలో భక్తులు కైంకర్యాలు, సుప్రభాతం, వ్రతాలు, ప్రసాదాల విక్రయాలు, సువర్ణ పుష్పార్చన తదితర సేవలు, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.1,16,13,977 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. గత ఆదివారం సైతం యాదగిరిగుట్టకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా.. ఒక్కరోజే రూ.1,09,82,000 ఆదాయం సమకూరింది.