ఖమ్మం, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్వరాష్ట్ర సాధన తరువాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న అనేక చర్యల ఫలితంగానే యావత్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాలులో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు ఆదివారం కూడా విశేష స్పందన లభించింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తొలుత స్టాళ్లను పరిశీలించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన అనతి కాలంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి జిల్లా ఎంతో వృద్ధి చెందిందని తెలిపారు. తద్వారా భూముల ధరలకు డిమాండ్ పెరిగిందని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సులభతరంగా అనుమతులు పొందేందుకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విజన్తో తీసుకొచ్చిన టీఎస్ బీపాస్తో ఎంతో ప్రయోజనం చేకూరుతున్నదని చెప్పారు.
ముఖ్యంగా ఖమ్మం నగరం నలువైపులా అభివృద్ధి చెందుతున్నదని ఆయన పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంపై అవగాహన కల్పించేందుకు, ఒకే వేదికపైకి బ్యాంకర్లు, నిర్మాణరంగ సంస్థలను తీసుకొచ్చి ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ విషయంలో ‘నమస్తే తెలంగాణ’ కృషిని కొనియాడారు. ఇలాంటి ప్రాపర్టీ షోలతో ప్రజలకు, వినియోగదారులకు మరింత అవగాహన పెరుగుతుందని తెలిపారు.
అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలిచిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంపూర్ణ సహకారంతో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ముద్రతో ఖమ్మం ప్రగతిపథంలో దూసుకెళ్తున్నదని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ తరహాలో ఖమ్మం నగరం దూసుకెళ్తున్నదని తెలిపారు. ఇలాంటి ప్రాపర్టీ షోలు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నమస్తే తెలంగాణ యాజమాన్యాన్ని కోరారు. కార్యక్రమంలో కేఎంసీ మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, బీఆర్ఎస్ నాయకులు కృష్ణ, పగడాల నాగరాజు, ప్రసాద్, శ్రీబాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి, శ్రీ నిధి ఎన్క్లేవ్ ఎండీ ఉన్నం జగన్, జీఆర్ ఇన్ఫ్రా అధినేత రాంబాబు పాల్గొన్నారు.