కరీంనగర్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు సర్వే విజయవంతంగా పూర్తి చేశామని, ఇప్పటివరకు 14,400 మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్టు కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. బుధవారం నుంచి అధికారులు రీ సర్వే చేస్తారని, దళిత కుటుంబాలన్నింటికీ ఈ పథకం అమలవుతుందని చెప్పారు. మంగళవారం కలెక్టరేట్లో క్లస్టర్ అధికారులు, ప్రత్యేక అధికారులతో దళిత బంధుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రీ సర్వేలో రేషన్కార్డులు లేని వారి వివరాలు, వలస వెళ్లిన వారి వివరాలను కూడా నమోదు చేసుకొని యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. రీసర్వేలో భాగంగా బ్యాంకర్లను కూడా వెంట తీసుకెళ్లి కొత్తగా గుర్తించిన వారికి కూడా ఖాతాలు తెరిపించాలని సూచించారు. మొదటిసారి సర్వే చేసినప్పుడు ఇంటికి తాళం వేసి ఉంటే రీ సర్వేలో వారిని గుర్తించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఖాతాలో డబ్బులు జమ కాగానే సెల్ఫోన్లకు సంక్షిప్త సమాచారం వస్తుందని, దీన్ని అధికారులు ధ్రువీకరించుకోవాలని సూచించారు. దళిత కుటుంబాలన్నింటికీ ఈ పథకం అమలు చేయడంతోపాటు ఖాతాలో వెంటనే డబ్బులు జమ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.