హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఖజానాకు మరో వెయ్యికోట్ల రూపాయలు చేరనున్నాయి. బాండ్ల విక్రయం ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. రూ.500 కోట్ల విలువైన బాండ్లను 26 ఏండ్ల కాలానికి, మరో రూ.500 కోట్ల విలువైన బాండ్లను 27 ఏండ్ల కాలానికి జారీ చేసింది. ఈ బాండ్లను ఆర్బీఐ మంగళవారం వేలం వేసింది. చివరిసారి సెప్టెంబర్ 6వ తేదీన బాండ్ల విక్రయాల ద్వారా రూ.2000 కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం సమీకరించుకున్నది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణాల మొత్తం రూ.19,500 కోట్ల రూపాయలు అవుతుంది. వీటిని మూలధనం కింద ఖర్చు చేసి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలని సర్కారు భావిస్తున్నది.
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.53,970 కోట్ల మేర రుణ సమీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. అయితే బడ్జెట్, అప్పులు తదితర సాకులను చూపుతూ రెండునెలల పాటు రుణాలు తీసుకోకుండా కేంద్రం అడ్డుకున్నది. కేంద్రం తీరును సీఎం కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. కేంద్రం ద్వంద్వ వైఖరిని జాతీయస్థాయిలో ఎండగట్టారు. రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు పలుమార్లు ఢిల్లీ వెళ్లి రుణాలు ఇవ్వాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. ద్వంద్వవైఖరిపై రాష్ట్ర ఆర్థికశాఖ సుదీర్ఘ లేఖ రాసింది. ఈ పరిణామాలతో కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చింది. అప్పటికే.. కేంద్రం తీరుతో సుమారు రూ.8 వేలకోట్లు తెలంగాణ నష్టపోవాల్సి వచ్చింది.