హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రోడ్డు రెన్యువల్ పనుల్లో వేగం పెంచాలని, జూన్ నాటికి రాష్ట్రంలో చేపట్టిన పనులన్నీ పూర్తి కావాలని అధికారులను ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఎర్రమంజిల్లోని ఆర్అండ్బీ ప్రధాన కార్యాలయంలో శాఖ కార్యదర్శి శ్రీనివాస్రాజు, ప్రత్యేక కార్యదర్శి విజయేంద్ర బోయి, ఈఎన్సీ రవీందర్రావు, అధికారులతో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయడంతో ఆర్అండ్బీ రోడ్లు అద్దాల్లా తయారవుతున్నాయని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1170 పీరియాడికల్ రెన్యువల్ రోడ్ల మరమ్మతుల పనుల కోసం రూ.2875 కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని, ఇందులో సుమారు రూ.570 కోట్లతో 232 పనులు ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 60 ఏజెన్సీలు పనులు చేపట్టాయని, ప్రతి ఏజన్సీ వారానికి కనీసం ఒక పని పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పురోగతిలో ఉన్న మిగతా 938 పనులను వారానికి 60 చొప్పున నెలలో 240 పనులు పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం జూన్ నాటికి అన్ని పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. ప్రతి వారం తానే స్వయంగా పనుల పురోగతి పరిశీలిస్తానని మంత్రి పేర్కొన్నారు.