హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మూషిక జింకలు (మౌస్ డీర్స్) మళ్లీ చెంగుచెంగున దుంకుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితమే రాష్ట్రంలో అంతరించిపోయిన మౌస్ డీర్ జాతిని సంరక్షించి సంతానోత్సత్తి పెంచేందుకు తెలంగాణ అటవీశాఖ తీసుకొన్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో ఇప్పటి వరకూ 17 బ్యాచ్ల (దాదాపు 140) మూషిక జింకలను అటవీశాఖ విడుదల చేయగా.. వాటిలో అత్యధికం సురక్షితంగానే ఉన్నాయి. 2009, 2010లో గుజరాత్ నుంచి రెండు మగ, నాలుగు ఆడ మూషిక జింకలను తీసుకొచ్చారు. హైదరాబాద్లోని జూపార్క్లో వీటిని సంరక్షించారు. సంతానోత్పత్తితో మూషిక జింకల సంఖ్య బాగా పెరిగింది.
వీటిని గడిచిన ఐదేండ్లలో రాష్ట్రంలోని వివిధ అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో 140, కిన్నెరసానిలో 28, నిర్మల్లో 10, జన్నారంలో 10, హయత్నగర్ మృగవని నేషనల్ పార్కులో 8, పోచారం వైల్డ్లైఫ్ శాంక్చువరీలో 16 విడిచిపెట్టారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో అత్యధికంగా 140 మౌస్ డీర్స్ను ఫర్హాబాద్ ప్రాంతంలో వదిలారు. వాటి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 50 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే, మూషిక జింకల మలం సేకరించి ల్యాబ్లో పరిశీలిస్తున్నారు. దీని ఆధారంగా అవి సంచరిస్తున్న ప్రాంతాలను తెలుసుకొంటున్నారు. వీటి శరీరానికి రేడియో కాలర్ చిప్ను అమరిస్తే, వాటి సమచారం పక్కాగా తెలుసుకొనే అవకాశం ఉందని, అయితే, ఇందుకోసం జాతీయ వన్యమృగ సంస్థ అనుమతి తీసుకోనున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు.
మూషిక జింకల సంఖ్య పెరుగుతున్నది..
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో 2017 నుంచి మౌస్డీర్ సాఫ్ట్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. నల్లమలలో అంతరించిపోయిన మూషిక జింకల జాతిని పునరుద్ధరించేందుకు అటవీశాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది సత్ఫలితాలను ఇస్తున్నది. క్రమంగా మూషిక జింకల సంఖ్య పెరుగుతున్నది. నిత్యం 50 ట్రాప్ కెమెరాలతో వాటి కదలికలను గమనిస్తున్నాం.
– రోహిత్ గోపిడి, డీఎఫ్వో (నాగర్కర్నూల్)