హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా మాదిగలకు ఇవ్వని కాంగ్రెస్ మాదిగ ద్రోహుల పార్టీగా మిగిలిపోయిందని, ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 80 లక్షల మంది మాదిగలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాకారులను అవమానించిన కేశవరావు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సోమవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో రసమయి మాట్లాడుతూ మాదిగలు ఎవరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. తెలంగాణలో అత్యధికంగా ఉన్న మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని మండిపడ్డారు. మాదిగలకు సీటు ఇవ్వకుంటే చావు డప్పు కొడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి మాదిగ ద్రోహి అని, వరంగల్లో ఆయనపై చావుడప్పు కొడతామని తెలిపారు.
మతిభ్రమించి మాట్లాడుతున్న ఎంపీ కేశవరావు వెంటనే కళాకారులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆయన ఇంటిముందు ధూంధాం నిర్వహిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ తెలంగాణపై విషం చిమ్ముతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాటకు చరిత్ర లేకపోతే ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్రగీతంగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. మిలియన్ మార్చ్లో కేశవరావును కోడిగుడ్లతో కొట్టారని గుర్తుచేశారు. కేశవరావు బిడ్డ అంటే ఎవరికీ తెలియని విజయలక్ష్మికి కేసీఆర్ మేయర్ పదవి ఇచ్చారని పేర్కొన్నారు. ఓట్ల కోసం గద్దర్ను వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని దుమ్మెత్తిపోశారు.
మాదిగజాతి అంటే కండ్లమంట
కడియం కావ్య కూడా కేసీఆర్ను విమర్శిస్తున్నారని రసమయి ఎద్దేవా చేశారు. శ్రీహరి ఏ బడిలో చదువుకున్నారో, ఎక్కడ బడి చెప్పారో ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. ఆయన ఏనాడైనా ‘జై తెలంగాణ’ అన్నాడా అని ప్రశ్నించారు. ఆయన మాదిగ ద్రోహి అని, మాదిగజాతి అంటే ఆయనకు కండ్లమంట అని విమర్శించారు. కడియం వైఖరి వల్లే తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్లాంటి వారు బీఆర్ఎస్ను వీడారని చెప్పారు.
కడియంను ఓడించి పాతిపెట్టే వరకు రసమయి బాలకిషన్ కాలుకి గజ్జెకట్టి ఆడిపాడతాడని తెలిపారు. శ్రీహరికి ఏమాత్రం దమ్మూధైర్యం ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగ ఓట్ల కోసం బీజేపీ తాపత్రయపడుతున్నదని, పదేండ్లుగా అధికారంలో ఉండి వర్గీకరణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మాదిగలకు కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఇచ్చిందో మందకృష్ణ మాదిగ ఎందుకు అడగడం లేదని రసమయి బాలకిషన్ ప్రశ్నించారు.