NIMS | నెలలు కూడా నిండని చిన్నారులకు గుండె సమస్య.. బతకాలంటే అత్యంత క్లిష్టమైన సర్జరీ చేయాలి. ఇందుకు కచ్చితంగా విదేశీ వైద్యబృందం సాయం అవసరం. అయితే, ఖర్చుకు వెనుకాడకుండా విదేశాల నుంచి వైద్యులను రప్పించారు. విజయవంతంగా సర్జరీలు పూర్తి చేయించారు. 8 మంది చిన్నారులకు కొత్త ఊపిరి పోశారు. ఇలాంటి సీన్లు సినిమాల్లో చూస్తుంటాం. ఇదంతా కార్పొరేట్ హాస్పిటళ్లలోనే సాధ్యమవుతుందని నమ్ముతుంటాం. కానీ.. ఇది జరిగింది ప్రభుత్వ దవాఖానలో. అదీ మన రాష్ట్రంలో. వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దీనిని సుసాధ్యం చేశారు.
హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): అరుదైన గుండె జబ్బులతో 8 మంది చిన్నారులు ఇటీవల నిమ్స్ హాస్పిటల్లో చేరారు. వారికి సర్జరీ చేసేందుకు బ్రిటన్ వైద్యుల సాయం అవసరం ఉంటుందని డాక్టర్లు గుర్తించారు. దీంతో మంత్రి హరీశ్రావు ప్రత్యేక ఆహ్వానం మేరకు బ్రిటన్ నుంచి ఆరుగురు వైద్యుల బృందం హైదరాబాద్కు చేరుకొన్నది. ఈ బృందానికి డాక్టర్ వెంకటరమణ దన్నపునేని నేతృత్వం వహించారు. వీరు నిమ్స్, నిలోఫర్ దవాఖానల వైద్యులతో కలిసి 4 రోజుల్లో 8 మంది చిన్నారులకు క్లిష్టమైన సర్జరీలు నిర్వహించారు. ప్రైవేట్లో ఒక్కో సర్జరీకి సుమారు రూ.5 లక్షల దాకా ఖర్చవుతుండగా, తెలంగాణ సర్కారు చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్స చేయించింది.
తాజాగా నెల వయసున్న శిశువుకు విజయవంతంగా సర్జరీ చేశారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్కు చెందిన శిశువు (తల్లి పేరు ఫాతిమా) ఇటీవల తీవ్ర హృద్రోగ సమస్యలతో నిమ్స్లో చేరింది. ఆర్టీరియల్ అనాటమీ, మల్టిపుల్ వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్స్తో బాధపడుతున్నట్టు గుర్తించారు. గత నెల 28న ఆర్టీరియల్ స్విచ్ రిపెయిర్, మల్టిపుల్ వీఎస్డీ క్లోజర్ సర్జరీలు నిర్వహించారు. శిశువు ప్రస్తుతం ఐసీయూలో కోలుకొంటున్నది. విదేశీ వైద్యుల సాయంతో ప్రభుత్వ దవాఖానలో ఇలాంటి సర్జరీలు జరుగడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి.
అరుదైన సర్జరీలు చేసి పిల్లల ప్రాణం కాపాడిన నిమ్స్ వైద్యులను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రత్యేకంగా అభినందించారు. బ్రిటన్ నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చి నిమ్స్లో చిన్నారులకు చేసే సర్జరీల్లో పాల్గొనడం, సహకారం అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. పిల్లలు త్వరలోనే పూర్తిగా కోలుకొని తల్లి ఒడికి చేరాలని హరీశ్రావు ఆకాంక్షించారు.