మహబూబ్నగర్, జూలై 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బాదేపల్లి పీఏసీఎస్లో గత యాసంగిలో జరిగిన మక్కజొన్న కొనుగోళ్ల అవకతవకలపై అధికారులు విచారణ ప్రారంభించారు. ‘నమస్తే తెలంగాణ’లో వస్తున్న వరుస కథనాలకు ఉన్నతాధికారులు స్పందించి గురువారం బాదేపల్లి పీఏసీసీఎస్లో విచారణ జరిపారు. రైతులు పండించిన పంటను పీఏసీసీఎస్ చైర్మన్ తన గోదాముకు తరలించి భారీ ఎత్తున రైతులకు టోపీ పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.
రైతులు ఆందోళనకు దిగినా అధికారులు స్పందించలేదు. దీంతో ‘నమస్తే తెలంగాణ’లో ‘మక్కలు బుక్కిన కాంగ్రెస్ నేత’ అనే శీర్షిక వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. జిల్లా సహకార సంఘం అధికారి కృష్ణ, సివిల్ సరఫరా అధికారి గణప శ్రీనివాస్, మార్క్ఫెడ్ డీఎం తహ్మీనాతోపాటు హార్టికల్చర్శాఖ ఆఫీసర్లు గురువారం కార్యాలయానికి వచ్చి మధ్యాహ్నం వరకు విచారణ జరిపారు.
కాగా విచారణ సమయంలో పీఏసీసీఎస్ చైర్మన్ అక్కడే ఉండడం పలు అనుమానాలకు తావిస్తున్నది. కాగా బాదేపల్లి పీఏసీసీఎస్లో జరిగిన అక్రమాలపై విచారణ జరుపాలని ఏకంగా సీఈవో యాదగిరి జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం గమనార్హం. గోదాములకు తరలించాల్సిన బస్తాలను నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ తన సొంత గోదాముకు 53,976 బస్తాలను తీసుకువెళ్లారని తెలిపారు. తీరా 53,119 బస్తాలు మాత్రమే రావడంతో 857బస్తాలు పక్కదారి పట్టినట్టు సీఈవో తన ఫిర్యాదులో ఆరోపించారు.
మక్కజొన్న కొనుగోళ్లలో బాదేపల్లి పీఏసీఎస్ చైర్మన్కు సహకరించిన మహబూబ్నగర్ మార్క్ఫెడ్ డీఎం తహ్మీనాను గురువారం సాయం త్రం అధికారులు సస్పెండ్ చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన మక్కజొన్నల్లో అవకతవకలకు పాల్పడినట్టు రుజువు కావడంతో ఆ శాఖ ఎండీ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచేశారు.