Maize Procurement Scam | మహబూబ్నగర్, జూలై 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుల నుంచి కొనుగోలు చేసిన మక్కజొన్నలను తెలివిగా తన గోదాములోకి మళ్లించి.. మూడో కంటికి తెలియకుండా అమ్ముకున్న అధికార పార్టీ నేత వ్యవహారం మహబూబ్నగర్లో సంచలనం రేపింది. ఓ ఎమ్మెల్యేను అడ్డుపెట్టుకొని కోట్లాది రూపాయ ల రైతుల సొమ్మును దర్జాగా దోచుకున్న ఉదం తం చర్చనీయాంశమైంది. ఈ తతంగం వెను క కాంగ్రెస్ నేత ఉండటంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఇటు పీఏసీఎస్ అధికారులు.. మార్క్ఫెడ్ అధికారులు మౌనం వ హించడం అనేక అనుమానాలకు తావిస్తున్న ది. మక్కజొన్నలు అమ్ముకున్న రైతుల బస్తాల ను గోల్మాల్ చేసి తరుగు పేరిట మోసం చేసిన ఈ ఘనుడిపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో మూడు నెలల కిందట మక్కజొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేశారు. తాము పండించిన మక్కజొన్నలు కొనాలని రైతులు ఆందోళన చేయడం తో రెండు నెలల కిందట కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ కేంద్రంలో 1,44,719 బస్తాల మ క్కజొన్నను 1,304మంది రైతుల నుంచి సేకరించారు. సుమారు 72,359.50 క్వింటాళ్లు కొని గోదాములకు పంపారు. జడ్చర్ల ప్రాంత రైతులకు చెందిన మక్కజొన్న సుమారు 53,976 బస్తాలు సుదర్శన్ గోదాములో నిల్వ చేశారు. ఈ గోదాము జడ్చర్ల సొసైటీ చైర్మన్ పేరు మీదే నడుస్తున్నది. అంతవరకు బాగానే ఉన్నా వారం, పది రోజుల నుంచి మక్కజొన్న అమ్మిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు నేరుగా జమచేస్తున్నారు. అమ్మిన బస్తాలకు, పడిన డ బ్బులకు వ్యత్యాసం భారీగా ఉండటంతో రైతు లు కంగుతిన్నారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. కాంగ్రెస్ నాయకుడు కావడం.. అందులో సొసైటీ చైర్మన్గా ఉండటంతో తన గోదాములోనే ఉంచిన బస్తాలకు డబ్బులు తక్కువ పడటంపై అనుమానాలు కలిగాయి.
రైతులు కష్టపడి పండించిన పంటలను కొ నుగోలు చేయలేక సర్కార్ చేతులెత్తేస్తుంటే.. మరోవైపు కొనుగోలు చేసిన మక్కలు అధికార పార్టీ నేత గోదాముకు తరలించడం వెనుక పెద్ద తతంగమే నడిచినట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారాన్ని వ్యతిరేకించిన ఒక ఉద్యోగిని కూడా సస్పెండ్ చేయించినట్టు ఆరోపణలు న్నాయి. కొనుగోలు చేసిన వాటిలో 40శాతం బస్తాలను ఏకంగా ఆ గోదాముకే తరలించా రు. ఆ గోదాముకు చేరిన బస్తాలు బరువు తగ్గినట్టు సృష్టించి రూ.కోట్లు దండుకున్నారు. వా స్తవంగా క్వింటాల్కు రెండో, మూడో కిలోలు తగ్గాలి కానీ ఈయన గోదాములోకి చేరిన సరుకులో క్వింటాళ్లకు క్వింటాళ్లు తగ్గడం గమనా ర్హం. కొనుగోలు రసీదు ప్రకారం ఖాతాల్లో డబ్బులు పడకపోవడంపై రైతులు ఆరా తీస్తే అమ్మకాల్లో భారీ తేడా జరిగినట్టు తేలింది.
జడ్చర్ల సొసైటీ పరిధిలో కొనుగోలు చేసిన మక్కజొన్న బస్తాలకు బస్తాలు మాయం వెను క అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్టు బహిరంగంగానే ఆరోపణలున్నాయి. రైతులకు న్యా యం చేయాల్సింది పోయి ఉల్టా దబాయిస్తున్నారు. అంతేగాక డబ్బులు పడ్డాయి.. ఇంకేం చేసుకుంటారులే.. అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. రైతులు మాత్రం వేల రూపాయలు తక్కువగా రావడంతో ఆవేదన చెందుతున్నారు. ఇదిలావుండగా మక్కజొన్న కొనుగోలు చేసే సమయంలో సొసైటీ ఆధ్వర్యంలో రిజిస్టర్లో నమోదు చేస్తూ అమ్మిన రైతులకు రసీదులు కూడా ఇచ్చారు. ఎంత కొనుగోలు చేశారో వాటికి తక్పట్టీలు ఇచ్చి రిజిస్టర్లో నమోదు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రైతులు అమ్మిన మక్కజొన్నకు సరిపడా డబ్బులు రాకపోవడంతో ఈ స్కామ్ బయటపడింది. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అండదండలతో రైతుల మక్కజొన్నను తన గోదాముకు తరలించి దర్జాగా అమ్ముకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జడ్చర్ల సొసైటీ నుంచి మొత్తం మక్కజొన్న కొనుగోలు చేశాం. కొనుగోలు చేసిన వాటిలో సుమారు 75 వేలకుపైగా బస్తాలను సుదర్శన్ గోదాముకు తరలించాం. కొంతమంది రైతులు డబ్బులు తక్కువగా వచ్చాయని అంటున్న మాట వాస్తవమే.
– యాదగిరి, సొసైటీ సీఈవో జడ్చర్ల, మహబూబ్నగర్ జిల్లా
106 బస్తాలు అమ్మితే నూట మూడు బస్తాలకే డబ్బులు పడ్డాయి. నాలాగా చాలామంది రైతులకు డబ్బులు తక్కువ వచ్చాయి. ఎందుకని అడిగితే అధికారులు సరైన సమాధానం ఇవ్వడం లేదు. గోదాములో దాచిపెట్టిన ధాన్యానికి రెక్కలు వస్తాయా? పంది కొక్కులు ఏమైనా తిన్నాయా? ఇంత నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు? మక్కజొన్న కొనుగోలులో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి.
– ఎనుముల సురేశ్రెడ్డి, కోడ్గల్, జడ్చర్ల, మహబూబ్నగర్ జిల్లా