ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్, నవంబర్ 9: నామినేషన్ల వేళ కాంగ్రెస్ బరితెగించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ర్యాలీపై రాళ్లదాడికి దిగింది. కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డికి ఉదయం 10.30 గంటలకు, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డికి మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు పోలీసులు సమయం కేటాయించారు. పార్టీ కార్యాలయం నుంచి మంచిరెడ్డి తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ చౌరస్తాకు ర్యాలీగా బయలుదేరారు. మరోవైపు, బొంగుళూరు వైపు నుంచి మల్రెడ్డి భారీ కాన్వాయ్తో ఇబ్రహీంపట్నం బయలుదేరారు. ర్యాలీలు రెండూ బస్డిపో వద్ద ఎదురుపడడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. కాంగ్రెస్ ర్యాలీలోని కొందరు బీఆర్ఎస్ ర్యాలీపై వాటర్ బాటిళ్లు విసిరి, రాళ్ల దాడికి దిగడంతో 36 మంది గాయపడ్డారు.
నలుగురు పోలీసులు కూడా గాయపడ్డారు. కొందరి తలలు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని సమీపంలోని దవాఖానకు తరలించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన సీపీ డీఎస్ చౌహాన్ అదనపు బలగాలను రప్పించి ఆందోళనకారులను చెదరగొట్టారు. నామినేషన్ అనంతరం మల్రెడ్డిని వేరే వాహనంలో తరలించగా, మంచిరెడ్డి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన రాళ్లదాడి ఘటనపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. సీసీకెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.