హైదరాబాద్ : 44 ఏండ్ల తర్వాత రంగారెడ్డికి జిల్లాలోనే జిల్లా కేంద్రం అందుబాటులోకి రానుంది. 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పాటుకాగా అప్పటి నుంచి హైదరాబాద్లోనే రంగారెడ్డి జిల్లా కేంద్రం ఉండడం గమనార్హం. చిన్న జిల్లాలతోనే సుపరిపాలన సాధ్యమని గుర్తించిన సీఎం కేసీఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను రంగారెడ్డితో పాటు వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఆయా జిల్లాలకు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను కూడా మంజూరు చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో జిల్లా ప్రజల కల నెరవేరింది. ఇప్పటివరకు హైదరాబాద్ జిల్లాలోని లక్డీకాపూర్లో ఉన్న రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ నేటి నుంచి రంగారెడ్డి జిల్లా పరిధిలో అందుబాటులోకి రానుంది.