హనుమకొండ, నవంబర్ 1: భారతీయ జనతా పార్టీకి మరో షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి ఏనుగుల రాకేశ్రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నుంచి టికెట్ ఆశించగా, అధిష్ఠానం ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మకు కేటాయించడంతో రాకేశ్రెడ్డి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం తన అనుచరులతో కలిసి హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో మీడియా సమావేశంలో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.
టిక్కెట్ రాకపోవడంతో భావోద్వేగానికి గురైన ఆయన పొమ్మనలేక పొగపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టిన గడ్డకు సేవ చేయాలనే తపనతో ఉన్నత ఉద్యోగాన్ని వదిలి బీజేపీలో చేరిన తాను 11 ఏండ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నందుకు బాధగా ఉన్నదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న తనను ఎన్నోసార్లు అవహేళన చేయడమే కాకుండా జిల్లా కార్యాలయంలో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారని వాపోయారు.
సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని చెప్పి బీజేపీ జాతీయ నాయకులు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వేలకోట్ల అధిపతి కొడుకు కాబట్టే రెండో జాబితాలో జితేందర్రెడ్డి కుమారుడికి టికెట్ ఇచ్చారని, ఒక రైతు బిడ్డను కాబట్టే తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ సిద్ధాంతాలు, మ్యానిఫెస్టోలు లేని పార్టీ అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు సీట్లు కూడా గెలువబోదన్నారు. అనుచరులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. కాగా, రాకేశ్రెడ్డిని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనుచరులతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తానని కడియంకు చెప్పినట్టు రాకేశ్రెడ్డి తెలిపారు.