హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 22 నుంచి 42 శాతానికి పెంచాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్రెడ్డికి ఆయన లేఖ రాశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ సీఎం ప్రకటన చేసినా బీసీలు కాంగ్రెస్ వైపే ఉన్నారని గుర్తు చేశారు. ముందుగా బీసీ కులగణన చేయాలని 2010 కర్ణాటక కేసులో, 2019 మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు.
బీసీ, ఎంబీసీ, సంచారజాతుల సంక్షేమానికి 2024-25 బడ్జెట్లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన సీఎం రేవంత్రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. బీసీ కులాలకు పాలకవర్గాలను నియమించాలని లేఖలో పేర్కొన్నారు. వెనుకబడిన కులాల సంక్షేమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్లపై ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.