సంగారెడ్డి, జూలై 19 (నమస్తే తెలంగాణ): 600 గ్రాముల అతిస్వల్ప బరువుతో జన్మించిన శిశువును బతికించలేమని ఓ ప్రైవేటు దవాఖాన చేతులెత్తేయగా, సంగారెడ్డి సర్కారు దవాఖాన అక్కున చేర్చుకొన్నది. విషమస్థితిలో ఉన్న నవజాత శిశువుకు ప్రాణం పోసేందుకు సంగారెడ్డి మాతాశిశు సంరక్షణ కేంద్రం వైద్యబృందం మూడు నెలలుగా అవిశ్రాంతంగా కృషిచేస్తున్నది. బతకదు అనుకొన్న తమ బిడ్డను కాపాడిన వైద్యులు, సిబ్బందికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. శిశువు ప్రాణం కాపాడేందుకు శ్రమించిన వైద్యసిబ్బందికి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డికి చెందిన అరుంధతి నెలలు నిండకుండానే పట్టణంలోని ఓ ప్రైవేటు దవాఖానలో మార్చి 28న ప్రసవించింది.
600 గ్రాముల బరువుతో ఆడశిశువుకు జన్మనిచ్చింది. అతి తక్కువ బరువుతో జన్మించిన శిశువును బతికించటం కష్టమని సదరు దవాఖాన వైద్యులు అరుంధతి భర్త శ్రీనివాస్గౌడ్కు తెలిపారు. బిడ్డపై ఆశలు వదులుకున్న దంపతులు ఇంటికి పయనం అయ్యారు. సంగారెడ్డిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మెరుగైన వైద్యులు, వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని, అందులో చేర్పించాలని అరుంధతి, శ్రీనివాస్కు ఇరుగుపొరుగు చెప్పారు. దీంతో ఎలాగైనా బిడ్డను కాపాడుకోవాలని అరుంధతి శిశువును ఎంసీహెచ్లో చేర్పించింది. తక్కువ బరువుతో ఉండటంతో బిడ్డ బతకటం కష్టమని, శ్వాసకోశ ఇబ్బందులు, పాలు తాగకపోవటం, జీర్ణాశయ సమస్యలు ఉంటాయని ప్రైవేటు వైద్యులు చెప్పారని ఎంసీహెచ్ వైద్యుల దృష్టికి తీసుకెళ్లింది. ‘అమ్మా.. నీ బిడ్డను కాపాడే బాధ్యత మాది, నిశ్చింతగా ఉండండి’ అంటూ ఎంసీహెచ్ వైద్యులు ఆమెకు భరోసా ఇచ్చారు.
కేఎంసీ చికిత్సతో శిశువుకు ప్రాణం
ఎంసీహెచ్ వైద్యులు శిశివును అక్కున చేర్చుకొని ఎన్ఐసీయూలో చికిత్స ప్రారంభించారు. ‘కంగారూ మెడికల్ కేర్(కేఎంసీ)’ పద్ధతిలో వైద్యంచేశారు. దీనినే స్కిన్ టూ స్కిన్ కాంటాక్ట్ అని కూడా అంటారు. ఈ విధానంలో శిశువును తల్లి సుమారు 16 గంటలపాటు తన చాతిపైనే ఉంచుకొంటుంది. తద్వారా శిశువులో సాధారణ ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు, శ్వాసకోశ రేటు, బరువు పెరుగుతుంది. అంతేకాకుండా శిశువు ఇన్పెక్షన్లను తట్టుకునే శక్తిని పొందుతుంది. ప్రైవేటు టీచర్గా పనిచేస్తున్న అరుంధతి.. ఇంటికి వెళ్లిన సమయంలో దవాఖానలో పనిచేస్తున్న నర్సులు శిశువును గుండెలపై వేసుకొని చికిత్సను అందజేస్తున్నారు.
వైద్యులు అశోక్, షబ్బీర్, శశికళ పర్యవేక్షణలో షిప్టుకు ఇద్దరు చొప్పున 10 మంది నర్సులు 111 రోజులుగా శిశువుకు కేఎంసీ చికిత్స చేస్తున్నారు. ఈ క్రమంలో శిశువు బరువు 600 గ్రాముల నుంచి 1.38 కేజీలకు పెరిగింది. చికిత్సలో భాగంగా ఆరుసార్లు రక్తం ఎక్కించారు. ప్రస్తుతం శిశువుకు ఎలాంటి ప్రమాదం లేదని, చికిత్సతో పూర్తిగా కోలుకుంటున్నదని ఎంసీహెచ్ వైద్యుడు జీ సతీశ్ తెలిపారు. త్వరలోనే సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జ్ అవుతుందని చెప్పారు. మంగళవారం ఎంసీహెచ్ను సందర్శించిన వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు.. దవాఖానలో 111 రోజులుగా చికిత్స పొందుతున్న నవజాత శిశువును చూశారు. బిడ్డను కాపాడిన వైద్యులను, మెరుగైన సేవలు అందజేస్తున్న సిబ్బందిని ప్రశంసించారు. చనిపోతుందనుకొన్న తమ బిడ్డకు ప్రాణం పోసిన వైద్యులు, నర్సులకు అరుంధతి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.