రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల ప్రజలు.. తెలంగాణ ఉద్యమ సారధి సీఎం కేసీఆర్ వెన్నంటే నడిచారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గుర్తుచేశారు. మంగళవారం సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. 2001లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఈ ప్రాంతంలో గులాబీ జెండాను ఎగురవేసినట్టు తెలిపారు. 2004లో కరీనంనగర్ ఎంపీగా కేసీఆర్ను భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారని, 2006లో రాజీనామా చేసిన సమయంలో, 2008లోనూ ఆయన వెంటే నడిచారని వివరించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 2009లో కేటీఆర్ను సిరిసిల్ల ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలు గెలిపించారని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్షకు బయలుదేరినప్పుడు కరీంనగర్ జిల్లా ప్రజలు కేసీఆర్కు అండగా నిలిచారని, సబ్బండ వర్ణాలు, కులాలు, మతాలకతీతంగా రోడ్డుమీదికొచ్చి ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. అభివృద్ధి, సంక్షేమంలో సిరిసిల్లను ఆదర్శంగా నిలిపిన మంత్రి కేటీఆర్ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ప్రజలను కోరారు. సిరిసిల్ల అభ్యర్థిగా కేటీఆర్కు టికెట్ ఇచ్చినందుకు నియోజకవర్గ ప్రజల పక్షాన అధినేత కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.