వరంగల్: ఉమ్మడి వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో జోరుగా వాన కురుస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్నది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కరీమాబాద్, సాకరిశికుంట, ఏకశిలానగర్లో భారీ వర్షానికి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, సిరిసిల్ల, తంగళ్లపల్లి, వీర్నపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో వర్షం కురుస్తున్నది.
నల్లగొండ జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన వానకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో నిడమనూరు మండలం ముప్పారం వాగు దగ్గర వరద ఉధృతికి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో సమీపంలోని మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.