Heavy Rains | హైదరాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన గాలుల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమబెంగాల్, జార్ఖండ్పై అల్పపీడనం ఏర్పడిందని వివరించింది. ఇది మంగళవారం నాటికి దక్షిణ దిశకు కదిలే సూచనలున్నాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఈ నెల 18న మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో వర్షాలు మరింత పెరుగుతాయని అంచనా వేసింది.
పశ్చిమ దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీయడంతో రాష్ట్రంలో సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు పడినట్టు వెల్లడించింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం రాత్రి వరకు భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు మరికొన్ని జిల్లాల్లో అతిభారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉంటాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.