హైదరాబాద్,జూలై 5 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని, ఇది ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి సమీపంలో కేంద్రీకృతమై ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. దీని ప్రభావంతో వచ్చే మూడ్రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
వర్షాలు కురిసే సమయంలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నది. భారీ వర్షాలు కురుసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, రాబోయే మూడ్రోజులు గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని ప్రాంతాలకు విస్తరిస్తాయని వెల్లడించింది.