హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరించడానికి కావాల్సిన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కే రామకృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు వికాస్రాజ్, జయేష్రంజన్, నవీన్మిట్టల్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జలమండలి ఎండీ అశోక్రెడ్డితో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన అండర్ బ్రిడ్జీలు, అప్రోచ్రోడ్ల నిర్మాణాలు, రోడ్ల విస్తరణ, చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రజా రవాణా కనెక్టివిటీ మెరుగు వంటి మొత్తం 21 అంశాలపై సీఎస్ సమీక్షించారు. రైల్వే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి, ఆయా శాఖల ఉన్నతాధికారులు, మున్సిపల్, జలమండలి, రెవెన్యూ, విద్యుత్, రోడ్డు భవనాల శాఖ అధికారులతో సంయుక్త తనిఖీలు నిర్వహించి సూచనలు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.