Kishan Reddy | కుమ్రం భీం ఆసిఫాబాద్/తాండూర్ : రాహుల్ గాంధీ జన్మలో ప్రధాన మంత్రి కాలేడని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కాగజ్నగర్లో నిర్వహించిన బీజేపీ విజయ్ సంకల్ప్ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇప్పుడు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ని గెలిపిస్తేనే హామీలు అమలు చేస్తామనే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తుందని ఆయన ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలుకు నిధులనెలా సమకూర్చుకుంటారో బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశ ప్రజలందరూ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు సైతం మోదీనే ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 400లకు పైగా సీట్లను గెలుస్తుందని.. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నిక అవుతారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.