‘వికారాబాద్ కా హవా.. లాకోఁ మరీజోఁకా దవా’ అని నానుడి. వికారాబాద్ అడవుల గాలి తగిలితే.. ఎలాంటి రోగమైనా మాయమై పోతుందని పెద్దలు చెప్తారు. అనేక ఔషధ మొక్కలకు, అద్భుత ప్రకృతి సంపదకు నిలయమైన వికారాబాద్ అడవులు ఇప్పుడు మాయమవ్వబోతున్నాయి. నేవీ లోఫ్రీకెన్వీ రాడార్ కేంద్రం ఏర్పాటుతో 12 లక్షల చెట్లు మాయమవనున్నాయి. లక్షల పక్షులు అంతర్ధానమవనున్నాయి. ఇక్కడే జన్మించే మూసీ నది కూడా ప్రమాదంలో పడబోతున్నది.
(ఓరుగంటి సతీశ్)
Vikarabad | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ అడవుల్లోనే పుట్టే మూసీ నది ప్రమాదంలో పడబోతున్నది. మూసీకి జలధారలు అందించే దామగుండం అడవులు కనుమరుగు కానున్నాయి. రాడార్ సెంటర్ కోసం ఇక్కడ అక్షరాలా 12 లక్షలకుపైగా వృక్షాలను నరికివేయనున్నారు. అభివృద్ధి పేరుతో రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో రోడ్డు వేయబోతున్నారు.
ఇలా రోడ్డు వేస్తే వన్యమృగాల మనుగడ కూడా కష్టమే. రోడ్డుపై వాహనాల రాకపోకలతో ఏర్పడే శబ్ద కాలుష్యం మరో సమస్యగా మారే ప్రమాదం ఉన్నది. వీటన్నింటికన్నా అతిపెద్ద సమస్య రేడియేషన్. వీఎల్ఎఫ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం వల్ల రేడియేషన్ బాగా పెరుగుతుందని, దీనివల్ల చుట్టూ కనీసం 30 కిలోమీటర్లు.. గరిష్ఠంగా 60 కిలోమీటర్ల పరిధిలో నివసించేవారి ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ప్రజలు వ్యతిరేకించటంతో వీఎల్ఎఫ్ టెక్నాలజీ కేంద్రాన్నే తీసివేశారని గుర్తు చేస్తున్నారు.
మనదేశంలో కూడా ఇతర రాష్ట్రాలేవీ వీఎల్ఎఫ్ కేంద్రం ఏర్పాటుకు అనుమతివ్వలేదని చెప్తున్నారు. భూ పరివేష్టిత ప్రాంతంలో వీఎల్ఎఫ్ కేంద్రం ఏర్పాటు చేయడాన్ని కూడా పర్యావరణవేత్తలు తప్పుపడుతున్నారు. దామగుండం పరిరక్షణ వేదిక పేరుతో స్థానికులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. రాడార్ కేంద్ర ఏర్పాటు ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. న్యాయస్థానాల్లో వీరి ప్రయత్నాలు పూర్తికాకముందే కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం 2,900 ఎకరాల అటవీ భూమిని నౌకాదళ అధికారులకు అప్పగించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నౌకాదళ అధికారులకు భూ పత్రాలను అందజేశారు.
12,12,753 చెట్ల నరికివేత
పచ్చదనానికి తెలంగాణ పర్యాయపదంగా మారిందని గణాంకాలు చెప్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటింది. పర్యావరణ సమతుల్యత, అడవులను కాపాడేందుకు కేసీఆర్ సర్కారు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. గత పదేండ్లలో తెలంగాణ రాష్ట్రం పచ్చదనం పెంపులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందనేది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టంచేశాయి.
ఇప్పుడు రాడార్ కేంద్రం ఏర్పాటుతో అక్షరాలా 12 లక్షల 12 వేల 753 వృక్షాలను నరకాల్సి వస్తున్నది. ఇవి ఆషామాషీ చెట్లు కావు. ప్రకృతి సిద్ధంగా వందల సంవత్సరాలుగా ఏర్పడ్డ చెట్లు ఇవి. వీటిని ఇప్పుడు నాటడమన్నది సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ నాటినప్పటికీ ఇవి పెరిగి పెద్దవి అయ్యేందుకు వందల సంవత్సరాలు పడుతుంది.
ఇవి ఇచ్చే పండ్లు, మంచిగాలికి వెలకట్టలేం. హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు వికారాబాద్ ప్రాంతానికి విహారయాత్రకు వస్తుంటారు. ఇక్కడి దట్టమైన అడవి, ఆ అడవి నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలికి తిరుగులేదు. ‘వికారాబాద్ కా హవా.. లాకో మరీజోకా దవా’ అనే నానుడి ఉన్నది. అంటే వికారాబాద్ ప్రాంతంలోని అడవుల నుంచి వచ్చే స్వచ్చమైన గాలి లక్షలాది రోగాలకు మందులా పనిచేస్తుందని చెప్తుంటారు.
నిజాం నిజాంనవాబు హైదరాబాద్ను పాలిస్తున్న సమయంలో అనంతగిరి అడవుల్లో ప్రత్యేకంగా రోగుల కోసమే ఒక వైద్యశాలను ఏర్పాటు చేసినట్టు చరిత్రకారులు సైతం చెప్తుంటారు. టీబీ, ఛాతి వ్యాధులున్నవారు ఇక్కడికి వస్తే రోగాలు నయం అవుతాయని శాస్త్రీయంగా కూడా రుజువయ్యింది. ఇక్కడి అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కలు విరివిగా లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం, వివిధ సంస్థలు కూడా ఔషధ మొక్కల నర్సరీలను కూడా ఏర్పాటు చేశాయి.
దేశంలోని అనేక ప్రాంతాలకు ఇక్కడి ఔషధ మొక్కలను రవాణా చేస్తుంటారు. నౌకాదళం రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో తాము కొట్టివేసే చెట్లకు ప్రత్యామ్నాయంగా 12 లక్షల మొక్కలు నాటుతామని హామీ ఇచ్చింది. ఒకవేళ వీళ్లు కొత్తగా నాటినా వాటిని వికారాబాద్లోనే పెట్టే అవకాశం లేదు. మన చట్టాల్లో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకొని ఎక్కడైనా మొక్కలు నాటవచ్చు.
ప్రమాదంలో 175 పక్షిజాతులు
వికారాబాద్ అటవీ ప్రాంతంలోని దామగుండం పరిసరాల్లో అరుదైన వ్యన్యప్రాణులు అనేకం ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం 175 రకాల పక్షిజాతులు ఇక్కడ జీవం పోసుకుంటున్నాయి. రాష్ట్ర రాజధానికి అతి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతానికి అనేక మంది పక్షి ప్రేమికులు వస్తుంటారు. దుప్పులు, జింకలు, కుందేళ్లు, అడవి పందులు.. ఇలా అనేక రకాల జంతుజాలం కూడా ఇక్కడ ఉన్నది. రాడార్ కేంద్రాన్ని నిర్మిస్తే ఇవన్నీ అంతరించిపోతాయి. దీనిపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
2008 నుంచి ప్రతిపాదన.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డిదే తొలి సంతకం
ఇక్కడ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 2008 నుంచి ప్రతిపాదనలున్నాయి. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే తొలిసారి ఇక్కడ రాడార్ కేంద్రం ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధంచేసింది. అయితే, పలు రాజకీయ పరిణామాలతో ఇది పక్కకు వెళ్లింది. 2014లో పరిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన రామ్మోహన్రెడ్డి తొలిసారి అధికారికంగా ఇక్కడి దామగుండం పరిసర ప్రాంతాల ప్రజలతో రాడార్ కేంద్రం గురించి చర్చించారు.
దామగుండం ప్రాంతం పూడూరు గ్రామపంచాయతీ పరిధిలో ఉంటుంది. దీంతో ఆ గ్రామపంచాయతీ తీర్మానం ఇవ్వాలని స్థానిక సర్పంచ్, వార్డు సభ్యులను కోరారు. అక్కడ కేంద్రప్రభుత్వ సంస్థ ఏర్పాటవుతుందని, దానివల్ల ఈ ప్రాంత ప్రజలకు బీహెచ్ఈఎల్ తరహాలో ఉండే ఒక టౌన్షిప్ వస్తుందని, విద్యాసంస్థలు, దవాఖానలు, రోడ్లు, లైట్లు.. ఇలా అన్నీ అందుబాటులోకి వస్తాయని నమ్మబలికారు. రాడార్ కేంద్రం గురించి అవగాహన లేకపోవడంతో గ్రామపంచాయతీలో తీర్మాన పత్రంపై సంతకాలు చేశారు.
ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి స్వయంగా పత్రాలు తీసుకొచ్చి సంతకం చేయమంటే చేశామని అప్పటి వార్డు సభ్యులు చెప్తున్నారు. సంతకాలు పూర్తికావడంతో ఎమ్మెల్యే మిగిలిన క్రతవును ముందుకు నడిపించారు. 2017 వరకు అంతర్గత పనులన్నీ పూర్తయి రక్షణ శాఖ అధికారులు ఇక్కడికి రావడంతో విషయం బయటకు వచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపింది. ప్రత్యామ్నాయ భూములు కూడా ఇస్తామని చెప్పింది. జాతీయ భద్రత కారణాలను కూడా చెప్పింది. అయితే, నాటి కేసీఆర్ సర్కారు ఈ అంశాన్ని నాన్చుతూ వచ్చింది. పూర్తిస్థాయి సమ్మతిని తెలుపలేదు.
కేంద్రం నుంచి అనేక సార్లు ఒత్తిడి వచ్చినా పట్టించుకోలేదు. 2018లో జరిగిన ఎన్నికల్లో రామ్మోహన్రెడ్డి ఓడిపోయి మహేశ్వర్రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు దామగుండంలో రాడార్ కేంద్ర ఏర్పాటుకు సంబంధించిన పనులేమీ జరగలేదు. తాజా ఎన్నికల్లో పరిగి నుంచి మళ్లీ మహేశ్వర్రెడ్డి గెలుపొందారు. ఆయన గెలిచిన పక్షం రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా సహకరించారు. పది రోజుల్లోనే ఒప్పంద పత్రాలపై సంతకాలు పూర్తిచేసి భూమి అప్పగింత కార్యక్రమాన్ని పూర్తిచేశారు. దీంతో స్థానిక ప్రజలు బిత్తరపోయారు.
వీఎల్ఎఫ్ కేంద్రంలో ఏం చేస్తారు?
సముద్రంలో, సముద్రగర్భంలో ఉండే భారత రక్షణ నౌకలు, జలంతర్గాములను పర్యవేక్షించటానికి ఈ కేంద్రానికి ఏర్పాటుచేస్తున్నారు. వెరీ లో ఫ్రీక్వెన్స్ రాడార్ సిస్టం దీని కోసం ఉపయోగిస్తారు. తరంగాలను ఉపయోగించి సముద్రంలో రాకపోకలు సాగించే నౌకల గమనాన్ని పరిశీలిస్తారు. ఈ రాడార్ కేంద్రాన్ని ఇక్కడే ఏర్పాటు చేయాలనేమీ లేదు. గతంలో ఇదే తరహా కేంద్రాన్ని కేరళలో పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడి ప్రజలు వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారని పర్యావరణవేత్తలు చెప్తున్నారు.
తరంగాలను పంపడమంటే రేడియేషన్ ప్రభావం కచ్చితంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీనిపై స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించలేదు. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొన్నది. ఎంత రేడియేషన్ ఉంటుంది? రేడియేషన్ ప్రభావం తగ్గేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారన్నది నౌకాదళ అధికారులు కానీ, స్థానిక ఎమ్మెల్యేగానీ ప్రజలకు వివరించి చెప్పలేదు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు కూడా దీనిపై దృష్టి పెట్టలేదు.
చుట్టుపక్కల గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటివరకు అలాంటి ప్రయత్నమే చేయలేదు. దామగుండం గ్రామం ఉన్న పూడూరు పంచాయతీ తీర్మానాన్ని మాత్రమే తీసుకున్నారు. చుట్టుపక్కల కనీసం 25 గ్రామాలున్నాయి. ఆ గ్రామాలవారికి రాడార్ కేంద్రంపై కనీస అవగాహన లేదు. తమ గ్రామాల్లో గ్రామసభలు పెట్టకుండా ఎలా అడవులను అప్పగిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మూసీకి నీళ్లు ఎలా?
మూసీ నది జన్మస్థానం వికారాబాద్ అడవులు. మూసీ నది జన్మస్థానం వద్ద ఉండే అనంతగిరి వద్ద రెండువైపులా అడవులుంటాయి. ఒకవైపు దామగుండం, మరోవైపు అనంతగిరి అడవులుంటారు. మూసీనదికి ఏర్పడే నీటి ఊటలు దామగుండంలో కూడా ఉన్నాయి. ఇక్కడ వేసవి కాలంలో కూడా నీటి ప్రవాహాలు కనిపిస్తుంటాయి. ఇక్కడి నీటి ఊటలు, చిన్నచిన్న పాయల సమూహమే మూసీగా రూపాంతరం చెందుతుంది. అలాంటిది ఇప్పుడు ఇక్కడి చెట్లను నరికివేసి రాడార్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తే నీటి ఊటలు మాయమవుతాయి. మూసీకి నీళ్లు రావ డం కూడా కష్టమే అవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
30 వేల మందికి ప్రత్యక్ష నరకం
దామగుండంలో రాడార్ కేంద్రం ఏర్పాటు సరికాదు. దీన్నివల్ల రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మేం దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డితో చెప్పాం. ఆయన తాను కారణం కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన ప్రోద్బలంతోనే ఇక్కడ వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ఏర్పాటవుతున్నది. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని 30 వేల మంది ప్రజలకు ప్రత్యక్షంగా ఇబ్బంది తప్పదు. రామ్మోహన్రెడ్డి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక పూడూరు గ్రామానికి వచ్చి పంచాయతీ తీర్మానం తీసుకెళ్లారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నేవీ అధికారులను వెంటపెట్టుకెళ్లి సీఎంతో రెండుసార్లు మీటింగ్ పెట్టించి భూములు బదిలీ చేయించారు.
-మల్లేశ్ పటేల్, సినిమా సెన్సార్బోర్డ్ సభ్యుడు, బీజేపీ నేత
ఉద్యోగాలిస్తామన్నది బూటకం
రాడార్ కేంద్రం వస్తే స్థానికులకు ఉద్యోగాలు ఇస్తారని ప్రచారం చేస్తున్నారు. ఇది శుద్ద అబద్ధం. ఉత్త బూటకపు మాట. రాడార్ కేంద్రంలో పనిచేసేదే కొద్ది మంది. దాంట్లో కూడా సాంకేతిక నిపుణులే ఉంటారు. మా గ్రామంలోని యువతకు ఉద్యోగాలు ఎలా ఇస్తారు? దేశంలో ఎక్కడ కూడా నేవీ కేంద్రాల్లో పనిచేసేవారికి స్థానిక రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఇక్కడ ఎందుకు ఇస్తారు? మా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతున్నది. మాకు ఉద్యోగాలు రావుకానీ.. కొంతమంది నాయకులకు కాంట్రాక్టులు వస్తాయి. పైసలు వస్తాయి. అందుకే వాళ్లు గ్రామ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
– వెంకటయ్య, దేవునోని గూడెం
మా ఔషధ మొక్కలు.. మా అడవి మాక్కావాలి
రాడార్ కేంద్రంతో మా అడవిలో దొరికే ఔషధాలు సర్వ నాశనమవుతాయి. ఔషధ మొక్కలను ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు? మా ప్రకృతిని ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు? ప్రజలకు హాని తలపెట్టే ఇలాంటి ప్రాజెక్టులను అడ్డుకొని తీరుతాం. ఒకవేళ రాడార్ కేంద్రమే మా అడవిలోకి వస్తే ఇక్కడ పిట్టలు కూడా గుడ్లు పెట్టవు. రాడార్ కేంద్రం వల్ల వచ్చే రేడియేషన్తో అనేక అనర్థాలు జరుగుతాయి. మా యువకులు, మా వృద్ధులు, మా పిల్లల భవిష్యత్తు గురించి ఎవ్వరూ మాట్లాడటంలేదు. మా ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డికి ఈ ప్రాజెక్టుపై ఎందుకంత ఆసక్తో చెప్పాలి.
– జంగయ్య, గ్రామ వార్డుసభ్యులు
ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత లేదా?
ఇంత పెద్ద కేంద్రాన్ని తీసుకొస్తున్నపుడు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదా? పర్యావరణవేత్తలను, నిపుణులను తీసుకొచ్చి మాకు అవగాహన కల్పించాల్సింది. ఎలాంటి అవగాహన కల్పించకుండా గ్రామ పెద్దలతో సంతకాలు చేయించుకున్నారు. గ్రామసభలను కూడా నిర్వహించలేదు. అంతా తూతూ మంత్రంగానే చేశారు.
-బస్వ శ్రీనివాస్గౌడ్
మమ్మల్ని ఏమార్చారు
మమ్మల్ని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ఏమార్చారు. ఈసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా పూడూరు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ప్రజాపాలనలో పాల్గొన్నారు. రాడార్ స్టేషన్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పాడు. తాను రాడార్ స్టేషన్ ఏర్పాటుకు వ్యతిరేకమన్నాడు. కానీ, మా గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాతి రోజే నేవీ అధికారులను తీసుకొని సీఎంను కలిశాడు. భూ బదిలీ కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి చేయించాడు. ఆయన మమ్మల్ని మోసం చేశారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
– టీ రాజేందర్, ఉపసర్పంచ్
సంతకం పెడితే 10 వేలు ఇస్తామన్నారు
మాకు రాడార్ సెంటర్ గురించే తెలియదు. ఒక రోజు సాయంత్రం ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి వచ్చి రాడార్ కేంద్రం వస్తుందని, మన ఊర్లో పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పంచాయతీ తీర్మానం కావాలన్నాడు. నేనే ఫస్ట్ సంతకం పెట్టిన.. మీరు కూడా పెట్టండి అని చెప్పిండు. పంచాయతీ తీర్మానం కావాలనడంతో మేము తీర్మాన పత్రంపై సం తకం చేశాం. సంతకం చేసిన తర్వాత ఎమ్మెల్యే మనుషులు వచ్చి రూ.10 వేలు ఇస్తామన్నారు. ఎందుకు అని అడిగితే తీర్మానంపై సంతకం చేసినవాళ్లు కొంతమంది అడిగిండ్రు అని చెప్పిండ్రు.
– సుజాత, మాజీ వార్డు సభ్యురాలు