ముషీరాబాద్, జనవరి 20: కేంద్రంలోని మోదీ సర్కారు బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. 34 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో బీసీల కోసం ఒక్క పథకం, ప్రత్యేక నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. కోర్టులు, జాతీ య, రాష్ర్టాల బీసీ కమిషన్లు కులగణన చేపట్టాలని సూచించినా కేంద్ర ప్రభుత్వం ముందుకురాకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. బీసీ జనగణన, బీసీ బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 25న చిత్తూరు జిల్లా మదనపల్లిలో దక్షిణాది రాష్ర్టాల బీసీ మహాసభ నిర్వహించనున్నట్టు చెప్పారు. గురువారం విద్యానగర్లోని బీసీభవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ మహాసభలో కేంద్ర ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. ఇందులో ఏడు రాష్ర్టాలకు చెందిన బీసీ సంఘాల నేతలు పాల్గొంటారని చెప్పారు. బీసీల సమస్యలపై చర్చించడానికి వచ్చేనెలలో ఢిల్లీలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుచేసే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. సమావేశంలో బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ జబ్బల శ్రీనివాస్, నాయకులు నీల వెంకటేశ్, కోలా జనార్దన్, సీ రాజేందర్, చంటి ముదిరాజ్, రాఘవా, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.