వైరా టౌన్, జూన్ 22: రాష్ట్రంలో ఓ వైపు అన్నదాతలు అరిగోస పడుతుంటే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాత్రం ఢిల్లీకి మూటలు మోస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. అన్నదాతల గోడు పట్టని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని మండిపడ్డారు. ‘బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్’పై వైరా నియోజకవర్గ బూత్స్థాయి ఏజెంట్లకు వైరాలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. పార్టీ సభ్యత్వ నమోదు వైరా నియోజకవర్గ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి అజయ్ మాట్లాడుతూ.. రైతుభరోసా, రుణమాఫీ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. వైరా మున్సిపల్ చైర్పర్సన్ భర్త బీఆర్ఎస్ నాయకులపైనా, కౌన్సిలర్లపైనా అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊర్కోబోమని హెచ్చరించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ద్వారా తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా 90 లక్షల ఓట్లను తొలగించడంతో అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని స్పష్టంచేశారు. 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని చెప్పారు.
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పెద్ద కుట్రలు పన్నాయని ఆరోపించారు. ఈ కుట్రలను తిప్పి కొట్టేందుకు బీఆర్ఎస్ బూత్ స్థాయి ఏజెంట్లు ఇంటింటికీ తిరిగి ‘ఎస్ఐఆర్’ గురించి ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నందున పార్టీ కార్యకర్తలు కూడా ఆ దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే ఊర్కోమని హెచ్చరించారు. సిరిపురంలో ఎమ్మెల్యే బెదిరింపులకు తలవంచకుండా సర్పంచ్ స్థానం దక్కించుకున్నామని గుర్తుచేశారు.