హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ‘దేశంలో ఏ రాష్ట్రంలో లేని ధాన్యం కొనుగోలు సమస్య, బాయిల్డ్ రైస్ సమస్య ఒక్క తెలంగాణలోనే ఎందుకొస్తున్నది?’.. ఇదీ అవగాహన, ఆలోచన లేని బీజేపీ రాష్ట్ర నేతల వాదన. కానీ దేశవ్యాప్తంగా బాయిల్డ్ సమస్య ఉన్నదన్న సత్యాన్ని తెలుసుకొనే జ్ఞానం వారికి లేకుండా పోయింది. యాసంగిలో ధాన్యం కొనుగోలు సమస్య ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు. దేశంలో వరి సాగుచేసే మెజారిటీ రాష్ర్టాలన్నింటిలో ఈ సమస్య ఉన్నది. దీనిపై మిగిలిన రాష్ర్టాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మాత్రమే రాష్ట్ర రైతుల ప్రయోజనం కోసం కేంద్రంతో కొట్లాడుతున్నారు.
మోదీకి ఛత్తీస్గఢ్ లేఖ
దేశంలో వరి సాగు చేసే రాష్ర్టాల్లో ఛత్తీస్గఢ్ కూడా ప్రధానమైనదే. అక్కడ కూడా బాయిల్డ్ రైస్ సమస్య ఉన్నది. తెలంగాణలో మాదిరిగానే అక్కడ కూడా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని కేంద్రం ప్రకటించింది. దీనిపై అక్కడి ప్రభుత్వం కేసీఆర్లాగా స్పందించలేదు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో లేఖ రాయించి మిన్నకుండిపోయింది. బాయిల్డ్ రైస్ కొనకుంటే రైస్ మిల్లులు మూతపడుతాయని, వేల మంది కార్మికులు రోడ్డున పడుతారని ఆవేదన వ్యక్తం చేసింది. సమస్య పరిష్కారంపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీని కోరింది. అయితే, ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
మహారాష్ట్ర, తమిళనాడులోనూ..
మహారాష్ట్ర, తమిళనాడులో కూడా బాయిల్డ్ రైస్ సమస్య ఉన్నది. బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం ప్రకటించటంతో ఆ రాష్ర్టాల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఎఫ్సీఐ విడుదలచేసిన యాసంగి కొనుగోళ్ల డాక్యుమెంట్లో తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి ఎంత ధాన్యం తీసుకొంటారనే లెక్కలు లేవు. జాబితాలో ఈ మూడు రాష్ర్టాల పక్కన ‘అవేటెడ్’ అని పేర్కొన్నది. ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్,కేరళ, అస్సాం నుంచి ఎంతెంత కొనుగోలు చేస్తారనే విషయాన్ని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత, అపరిపక్వ నిర్ణయంతో ఆయా రాష్ర్టాల్లో బాయిల్డ్ మిల్లులు పూర్తిగా మూతపడే పరిస్థితి వచ్చింది. వాటిపై ఆధారపడిన వేల మంది కార్మికుల జీవితాలు అగమ్యగోచరమయ్యాయి.