నర్సాపూర్ : రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి తెలిపారు. శనివారం నర్సాపూర్ పట్టణంతో పాటు ఆయా గ్రామాల్లో ఏఎంసీ, పీఎసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో వరి పంట పండిందని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని వసతులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. వడ్ల నిల్వలతో పాటు లారీల కొరత ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ధాన్యానికి సంబంధించిన డబ్బులను వెంటనే రైతుల ఖాతాలో వేస్తామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనసూయ అశోక్గౌడ్, పీఎసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, వైస్ఎంపీపీ వెంకటనర్సింరావు, టీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.