హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకంపై అధ్యయనానికి మరో రాష్ట్రం సిద్ధమైంది. ఈ పథకాన్ని పంజాబ్లో అమలు చేసేందుకు ఆ రాష్ట్ర అధికార బృందం తెలంగాణలో పర్యటించనున్నది. దీనిపై ఇప్పటికే తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు పంజాబ్ అధికారులు సమాచారం ఇవ్వటంతో, పర్యటన షెడ్యూల్ను కూడా ఇక్కడి అధికారులు సిద్ధం చేశారు. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇరిగేషన్ అధికారుల బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుండగా, ఏ తేదీ అనేది మినహా పర్యటన షెడ్యూల్ పూర్తిగా ఖరారైంది. మొదటి రోజు రాజన్న సిరిసిల్ల, ఇల్లందకుంట, రెండో రోజు జనగామ, భువనగిరి, మూడో రోజు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో బృం దం పర్యటించనున్నది. ఆయా జిల్లాల్లోని చెరువులను సందర్శించటంతోపాటు, ఆయకట్టు రైతులతో మాట్లాడనున్నది. మిషన్ కాకతీయకు ముందు, ఆ తర్వాత చెరువుల పరిధిలో వచ్చిన మార్పులను అధ్యయనం చేయనున్నది. చివరి రోజు మిషన్ కాకతీయ ఫలితాలపై తెలంగాణ ఇరిగేషన్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
గత వారమే పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సిద్దిపేట జిల్లాలో కొండపోచమ్మ రిజర్వాయర్, మర్కూక్ పంప్హౌస్ను సందర్శించారు. ఎర్రవల్లి చెక్డ్యాం, గజ్వేల్ పాండవుల చెరువును పరిశీలించారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, పెరిగిన భూగర్భజలాల గురించి రాష్ట్ర నీటి పారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. మిషన్ కాకతీయ ఫలితాలను చూసి ఆశ్చర్యపోయారు. తెలంగాణ పర్యటన ముగించుకొని పంజాబ్ వెళ్లిన సాయంత్రమే అక్కడి అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇరిగేషన్ అధికారులను పిలిపించుకొని మిషన్ కాకతీయ గొప్పదనాన్ని వారికి వివరించటం విశేషం. స్వయంగా తెలంగాణకు వెళ్లి మిషన్ కాకతీయ ఫలితాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ అధికారుల బృందం రాష్ర్టానికి రానున్నది.