Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ వాళ్లను తీసుకొస్తే మళ్లా పాములు కరుసుడు, తేళ్లు కుట్టుడు, ఉరేసుకునుడు, మందు డబ్బాలు పట్టుకొని సచ్చుడు.. ఇలాంటివే వస్తాయని, అలాంటి బతుకులు తమకు వద్దేవద్దని స్పష్టం చేస్తున్నారు నల్లగొండ జిల్లా చిన్నసూరారానికి చెందిన పూలమ్మ. కేసీఆర్ వచ్చాక 24 గంటల కరెంట్తో ఆరెకరాల పొలం పారించుకుంటున్నానని, 300 బస్తాల వడ్లు పండుతున్నాయని తెలిపారు. ఆ వడ్లు కూడా కేసీఆరే కొంటున్నారని, ఏ రందీ లేకుండా హాయిగా ఉంటున్నామని వెల్లడించారు. ఆమె ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ‘మాకు ఆరెకరాల పొలం ఉన్నది. వేరేటోళ్ల పొలం కౌలుకు కూడా చేస్తం. చంద్రబాబు, రాజశేఖర్రెడ్డి హయాంలో మాకు నీళ్లే రాకుండే. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఆ కాలంలో వాళ్లకు ఆరు నెలలు. ఆ పొలం కాడికి, ఈ పొలం కాడికి మా ఆయన ఒక్కడే అటు, ఇటు తిరిగే సరికి కరెంటు పోయేది. దాంతో మా పిల్లలను మా అమ్మ (పెద్ద సూరారం) వాళ్లింట్లో వదిలి పెట్టి, మేమిద్దరం అర్ధరాత్రి సైకిల్ వేసుకొని వెళ్లి చెరో బావి దగ్గర పడుకొని కరెంటు పెట్టిన రోజులు ఉన్నయ్. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినకాడి నుంచి మాకు 24 గంటల కరెంటు వస్తుంది. మా ఆడబిడ్డలతో పాటు మా ఆయన కూడా ఇంట్లోనే పడుకుంటుండు.
సంవత్సరం అంతా పారుతున్నది పొలం. నాలుగు బోర్లు వేసుకున్నం. అవన్నీ మంచిగ నీళ్లు ఇస్తున్నయ్. ఇప్పుడేమో బోర్లకు పెద్ద మోటర్లు పెట్టాలని రేవంత్రెడ్డి అంటున్నడు. గీ నీళ్లకు పెద్ద మోటర్లు ఎట్ల పెడ్తడు? అసలు పెట్టకూడదు కదా! ఒకటేసరి పెద్ద లావు కట్టె తెచ్చి నోట్లో పెడితే పడ్తదా? పట్టదు కదా. ఇప్పుడు బోర్లు పోసే నీళ్లకు, 24 గంటల కరెంటుకు మాకు సరిపోతుంది. 3 గంటల కరెంటుకు ఎట్ల సరిపోతుంది? మాకు తెలంగాణ గవర్నమెంట్ కావాలె. మేం కేసీఆర్కే ఓటేస్తం. కాంగ్రెస్కు ఓటెయ్యం. కాంగ్రెస్కు ఎందుకు ఓటెయ్యాలె? మా తాతలు, ముత్తాతలు తెల్లందాకా బావుల కాడ పడుకొని ఉరేసుకొని, పాములు, తేళ్లు కరిచి.. పడుకున్నోళ్లు పడుకున్నట్టే చచ్చిపోయిర్రు. వేరేవాళ్ల భూముల్ని కౌలుకు పట్టుకొని పంటలు పండక అప్పులయ్యి చచ్చిన రోజులున్నయ్. ఈ రోజు మాకు ఏ బాధా లేదు. మావోళ్లు సాయంత్రం 6 గంటలకు వచ్చి ఇంట్లో పండుకుంటే, మళ్లీ పొద్దున ఆరు గంటలకు బాయికాడికి పోయి పని చూసుకుంటుర్రు. మళ్లా కాంగ్రెస్ వాళ్లను తీసుకొస్తే, మళ్లా పాములు కరుసుడు, తేళ్లు కుట్టుడు. ఉరేసుకునుడు. మందు డబ్బాలు పట్టుకొని సచ్చుడు.. ఇసోంటివి మాకు అవసరం లేదు. కాంగ్రెస్కైతే వెయ్యనే వెయ్యం. ఆ రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకు ఒక్కదానికి కూడా అర్థంపర్థం లేదు.
ఆయనొచ్చి ఒక 3 గంటలు బాయికాడ పండుకొని పొలం పారిస్తే ఆయన ఎన్ని ఎకరాలు పారిస్తున్నడో తెలుస్తది. పోయి ఏసీ రూముల్లో పడుకుంటే రైతుల కష్టాలేం కనిపిస్తయ్? మా బాధలు, కష్టాలు ఏం కనిపిస్తయ్? రేపటి రోజు కాంగ్రెస్కు ఓటేస్తే.. మళ్లా నా ఇద్దరు బిడ్డలు, నేను ఆడోళ్లం ఇంట్లో పడుకుంటే, మా ఆయన పోయి బాయికాడ పడుకుంటే మా పరిస్థితి ఏంది? రేవంత్రెడ్డికి అంటే ముడ్డి చుట్టూ ముగ్గురు గన్మెన్లను పెట్టుకుంటడు. మరి మాకు లేరు కదా. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అస్సలు వద్దు. నేను ఒక మహిళను అయ్యి ఉండి కూడా వ్యవసాయం చేస్తున్న. ఆరు ఎకరాల పొలం పెట్టుకున్నం. 300 బస్తాల వడ్లు అయినయ్. ప్రభుత్వం మంచిగ వడ్లు కొంటున్నది. మాకు రేటు కూడా తగినంత ఇస్తున్నది. బ్యాంకుల చుట్టూ, దాని చుట్టూ, దీని చుట్టూ తిరిగే అవసరం లేకుండా అకౌంట్లో పైసలు పడుతున్నయ్. ఆ అవసరం కూడా లేదు. మాకు ఇప్పుడు ధైర్యం ఉంది. అప్పులోళ్లకు, ట్రాక్టర్కు, దున్నినోళ్లకు ఉన్నకాడినుంచే మంచిగ పైసలు ఇస్తున్నం. ఇప్పుడే మంచిగున్నం. కారు గుర్తుకే ఓటేస్తం. కేసీఆర్నే గెలిపించుకుంటం’ అని తేల్చి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటున్నదని, రైతులకు అన్ని రకాలుగా లబ్ధి చేకూరుతున్నదని పేర్కొన్నారు.