హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తీన్మార్ మల్లన్న, ధర్మపురి అర్వింద్ రాష్ర్టానికి పట్టిన శని అని, ఈ నలుగురు దుష్ట చతుష్టయం అని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అక్కరకు రాని అంశాలపై రేవంత్రెడ్డి రచ్చ చేస్తున్నారని, ఆయన బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ అని ఫైర్ అయ్యారు. పార్లమెంటులో ధాన్యం సేకరణపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఆయన ఆత్మ ఇప్పుడు బీజేపీ, మోదీ చుట్టూ తిరుగుతున్నదని వ్యాఖ్యానించారు. ముందుగా ఇంట గెలిచి రచ్చ గెలవాలని హితవు చెప్పారు. అరాచకాలకు బ్రాండ్ అంబాసిడర్ బండి సంజయ్ అని, ఆయనకు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బీజేపీ బేరగాళ్ల పార్టీ అని, ఆ పార్టీ రాష్ట్ర నేతలు గుజరాత్కు దేశాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని, ఆ రెండు పార్టీలు నాంపల్లి బ్రదర్స్గా మారాయని అన్నారు. రెండు పార్టీల కార్యాలయాలు నాంపల్లిలోనే ఉన్నాయని, వాటికి సొరంగాలు తవ్వుకొని మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన దీక్షను అవమానిస్తే తెలంగాణను అవమానించినట్టేనని తెలిపారు. కేసీఆర్ దీక్ష చేయకుంటే తెలంగాణ వచ్చేదే కాదని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకొంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీగా ఓడిపోయిన తరుణ్ చుగ్కు కేసీఆర్, తెలంగాణ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. ఆయనకు కేసీఆర్ రాజకీయ జీవితం అంత వయసు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సింహంలాంటివారని, తరుణ్చుగ్ ఎలుకలాంటివారని ఎద్దేశా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల సీఎంలను ఇక్కడికి తీసుకురావాలని, వారికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి సీఎం కేసీఆర్ చెప్తారని పేర్కొన్నారు. కేసీఆర్ స్కీంల సీఎం అయితే.. బీజేపీ స్కాంల పార్టీ అని, సెల్లర్స్ పార్టీ అని వర్ణించారు. తెలంగాణలో 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని జీవన్రెడ్డి బీజేపీని డిమాండ్ చేశారు.