Congress | హైదాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఏపీపీఎస్సీలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి రాష్ట్రంలోని ఏ నిరుద్యోగిని కదిపినా కథలు కథలుగా చెప్తారు. స్వార్థ రాజకీయాలతో నాటి పాలకులు తెలంగాణ నిరుద్యోగుల పొట్ట కొట్టారు. ఏపీపీఎస్సీని ఆక్రమాలకు కేరాఫ్గా మార్చిన కాంగ్రెస్.. నేడు టీఎస్పీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ రాద్ధాంతం చేస్తున్నది. కాంగ్రెస్ దుర్మార్గాలను మర్చిపోయిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజకీయ కుట్రతో దొంగ దీక్షలు చేస్తున్నారు. నాడు కాంగ్రెస్ చేసిన అవినీతి పనులు మర్చిపోయి నేడు సుద్దులు చెప్తున్నారు. నాడు నిరుద్యోగుల ఉసురు తీసి నేడు వారిపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ వ్యవహారం గురవింద గింజ సామెతను గుర్తు చేస్తున్నది. గురువింద గింజ తన కింద ఉన్న నలుపును మర్చిపోయినట్టు కాంగ్రెస్ కూడా నాడు చేసిన అవినీతి అక్రమాలను మర్చిపోయింది.
కాంగ్రెస్ అవినీతి పాలనకు బాధితులుగా మారిన తెలంగాణ యువత నాటి తప్పుల్లో ఏ ఒక్కదానినీ మర్చిపోలేదు. తెలంగాణ యువతకు ఎవరేమిటో బాగా తెలుసు. ఏపీపీఎస్సీలో జరిగిన తప్పులు వ్యవస్థ చేసిన తప్పులు కాగా నేడు టీఎస్పీఎస్సీలో జరిగిన తప్పులు కేవలం ఇద్దరు స్వార్ధపరులైన వ్యక్తుల వల్ల కలిగినవే. ఎనిమిదేండ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా అవినీతి మరక లేకుండా ఎంతో పారదర్శకంగా వేల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసిన టీఎస్పీఎస్సీ నిరుద్యోగులకు అండగా నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగుల ప్రయోజనాలను గాలికొదిలేసి స్వార్థ రాజకీయాలు చేస్తున్న రేవంత్రెడ్డిపై రాష్ట్ర యువత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే వాటిని చెడగొట్టేలా రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. వారి రాజకీయ చదరంగంలో తమను పావులుగా వాడుకునేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.