నల్లగొండ ప్రతినిధి, మే 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా ముందుకు సాగుతున్నాయని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణను కొట్లాడి సాధించుకొన్నామని, ఇప్పుడు ఇతర ప్రాంతాలకు అన్నంపెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని చెప్పారు. గత ఏడున్నరేండ్లల్లో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం నుంచి 3,65,797 కోట్ల రూపాయలను పన్నుల రూపంలో చెల్లించామని, రాష్ర్టానికి తిరిగి కేంద్రం ఇచ్చింది మాత్రం లక్షా 60వేల కోట్లు మాత్రమేనని ఆయన వివరించారు. రాష్ట్రం చెల్లిస్తున్న పన్నుల డబ్బును మధ్యప్రదేశ్, యూపీ, గుజరాత్, బీహార్ రాష్ర్టాలకు కేంద్రం ఉపయోగపడుతున్నదంటే.. ఆయా ప్రాంతాలకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగినట్లేనని కేటీఆర్ వివరించారు.
నల్లగొండ జిల్లా హాలియా పట్టణంలో శనివారం మంత్రి కేటీఆర్ పర్యటించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో రూ.56కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం హాలియాలో స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వరంగల్లో నిర్వహించింది రైతు సంఘర్షణ సభ కాదని, నాయకులు తన్నుకునే సభ అని కేటీఆర్ పేర్కొన్నారు. పబ్బులు, క్లబ్బులు తప్ప ఎడ్లు, వడ్ల గురించి కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీకి ఏం తెలుసని ప్రశ్నించారు.
పదిసార్లు అవకాశమిస్తే పనిచేయని కాంగ్రెస్కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని రాహుల్ అడుగడం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. నాగార్జునసాగర్లో జానారెడ్డికి ఏడుసార్లు అవకాశమిస్తే ఏం ఉద్ధ్దరించారని ఆయన విమర్శించారు. ‘కాంగ్రెస్ నేతలు సమర్థులైతే.. జిల్లా నుంచి ఎందుకు ఫ్లోరోసిస్ను తరమివేయలేదు. కరెంటు ఎందుకు ఇవ్వలేదు.. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, నెల్లికల్ లిఫ్టు ఎందుకు ఇవ్వలేదు..?’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తలాపున కృష్ణమ్మ ఉన్నా.. తాగడానికి గుక్కెడు నీరివ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రూ.46 వేల కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు.
సాగర్ హామీలను నిలబెట్టుకున్నాం
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నారని, ఎంసీ కోటిరెడ్డిని శాసనమండలికి పంపారని, డిగ్రీ కళాశాల ప్రారంభించామని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.670 కోట్లతో నెల్లికల్లు ఎత్తిపోతల పథకం పనులు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రూ.820 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. గతంలో ఆరడుగుల ఆజానుబాహులు మంత్రులుగా ఉన్నా.. ఆరు గంటలకు మించి కరెంటు ఇవ్వలేకపోయారని కేటీఆర్ అన్నారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ను అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు అయ్యిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు నిజమయ్యాయని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే భగత్కుమార్ విజ్ఞప్తి మేరకు హాలియాలో మినీ స్టేడియం నిర్మాణానికి రూ.3.70 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఓపెన్ డ్రైన్ల అభివృద్ధికి మరో రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, జడ్పీ చైర్మన్లు బండ నరేందర్రెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్రావు, గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, కార్పొరేషన్ల చైర్మన్లు దూదిమెట్ల బాలరాజుయాదవ్, సాయిచంద్, ఉప్పల శ్రీనివాస్గుప్తా, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, సీడీఎంఏ ఎన్.సత్యనారాయణ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
రూ.670 కోట్లతో నెల్లికల్లు ఎత్తిపోతల పథకం
రూ.820 కోట్లతో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు
75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్త్ను అందించిన ఏకైక రాష్ట్రం
హాలియాలో మినీ స్టేడియం నిర్మాణానికి రూ.3.70 కోట్లు మంజూరు
ఓపెన్ డ్రైన్ల అభివృద్ధికి మరో రూ.15 కోట్లు మంజూరు