స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, ఫిబ్రవరి 1, (నమస్తే తెలంగాణ): రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ జోరు కొనసాగించాలని, వాటాలను తెగనమ్మాలని కేంద్రం నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.51 వేల కోట్లు సమీకరించాలని కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.65 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం.. జనవరి 18 నాటికి రూ.31 వేల కోట్లు సమీకరించినట్టు ఆర్థిక సర్వే వెల్లడించింది.
రానున్న ఆర్థిక సంవత్సరంలో మరో రూ.51 వేల కోట్ల వాటాలు విక్రయించేందుకు ప్రతిపాదించింది. మోదీ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్కు తెగనమ్మడం, వాటిలో ప్రభుత్వ వాటాలను ఉపసంహరించుకోవడం ద్వారా రూ.4.48 లక్షల కోట్లు ఆర్జించినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2014-19 మధ్య కాలంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.3.22 లక్షల కోట్లు సమీకరించింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత 2019-22 మధ్య కాలంలో మరో రూ.1.26 లక్షల కోట్ల వాటాలు, ఆస్తులు అమ్మేసింది. దీంతో ఎనిమిదేండ్లలో రూ.4.48 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ వాటాలను ప్రైవేట్కు ధారాదత్తం చేసినట్టయ్యింది. ప్రస్తుత ద్రవ్యోల్బణం ప్రకారం దీని విలువ రూ.6.19 లక్షల కోట్లుగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
లాభదాయక సంస్థలు ప్రైవేటుకు
కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రభుత్వ రంగసంస్థల అమ్మకాలపై కన్నేసింది. ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయన్న సాకు చెప్పి తెగనమ్మడమే పనిగా పెట్టుకున్నది. వాస్తవానికి ప్రభుత్వ రంగ సంస్థలు ఏనాడూ నష్టాల్లో లేవని కేంద్ర గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలు ఏటేటా భారీ స్థాయిలో డివిడెండ్లను అందిస్తున్నప్పటికీ వాటాలను అమ్మేస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను విక్రయించడం ద్వారా బంగారు గుడ్లు పెట్టే బాతులను కోసుకొని తిన్న చందంగా వ్యవహరిస్తున్నది. 1991 నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జాడ్యం మొదలు కాగా ఇప్పటివరకు తెగనమ్మిన వాటాల విలువ మోదీ హయాంలోనే 72% ఉండటం గమనార్హం.