కరీంనగర్ : హుజురాబాద్లో మున్నూరుకాపు, రజక సంఘాలకు భవన నిర్మాణాల నిమిత్తం భూమి పట్టాల్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అందజేశారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే స్పందిస్తూ అడిగిందే తడవుగా కుల సంఘాలకు ఎకరం భూమి రూ.50 లక్షలు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన పట్టాలను గురువారం హుజురాబాద్లో కుల సంఘాల ఆధ్వర్యంలో సిటీ సెంటర్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సహచర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి గంగుల కమలాకర్ సంఘ నాయకులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బీసీలకు ఆత్మగౌరవ ప్రతీకలుగా కుల సంఘాల భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ భవనాలు కొన్ని చోట్ల పూర్తికాగా మరికొన్ని చోట్ల నిర్మాణంలో ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వెనుకబడిన వర్గాలు ఆత్మగౌరవంతో బతుకుతున్నాయన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఎందరో ప్రధానులు, ముఖ్యమంత్రులు మారినా ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం సంకల్పించని ఆత్మగౌరవ భవన నిర్మాణాల కార్యక్రమాలాకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టిందన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఇక్కడి స్థానిక మాజీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఏనాడు కూడా బీసీల గురించి సీఎం కేసీఆర్ను అడగకుండా ద్రోహం చేశాడని మండిపడ్డారు.
అడగనిదే అవ్వైనా అన్నం పెట్టదని మంత్రి అన్నారు. స్థానిక సమస్యలను ఈటల ఏనాడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలేదని ద్వజమెత్తారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో తక్షణమే తొలివిడతగా మున్నూరు కాపు, రజక సంఘాలకు భూమిని కేటాయించారన్నారు. ఎకరం భూమితో పాటు ఒక్కో భవన నిర్మాణానికి రూ. 50 లక్షల నిధుల్ని తొలివిడతగా అందించారన్నారు.
మొదటి విడతగా నిధుల్ని అందించడంతో పాటు మలి విడత నిధుల్ని కూడా తీసుకొస్తానని మంత్రి గంగుల తెలిపారు. ఇంతలా మన సంక్షేమాన్ని చూస్తున్న ముఖ్యమంత్రికి అండగా నిలవాల్సిన భాద్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్న సీఎంకు మద్దతుగా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, ఎగ్గే మల్లేశం, మేయర్ వై.సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి- హరిశంకర్, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.