భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా పల్లెలను పట్టించుకున్న పాపానపోలేదని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విమర్శించారు. కాలువల వెంట కనీసం బ్లీచింగ్ చల్లే దిక్కు లేదని దుయ్యబట్టారు. వర్షాలు మొదలై పల్లెల్లో పారిశుద్ధ్యం లోపిస్తున్నా నివారణ చర్యలులేవని ధ్వజమెత్తారు. పల్లెల్లోని సమస్యలను పరిష్కరించాలని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, ఆరు గ్యారెంటీలను అమలుచేయాలని, 420 హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపుమేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
అనంతరం ఆయా సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. పాలకవర్గాలు లేని కారణంగా పంచాయతీల అభివృద్ధి కుంటుపడుతున్నదని, గ్రామాల్లో బ్లీచింగ్ చల్లించకపోవడం, మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడం, చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించకపోవడంతో పారిశుధ్యం లోపించిందని ధ్వజమెత్తారు. వర్షాలు కురుస్తుండడంతో పల్లెల్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నా నివారణకు చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో పారదర్శకత లేదని, జాబితాల నిండా అనర్హులేనని విమర్శించారు. భద్రాద్రి జిల్లాలో పల్లెల దుస్థితి గడిచిన 18 నెలలుగా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..’ అన్నచందంగా ఉందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా స్పందించి ఆయా సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.