హైదరాబాద్: ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించిన బెటాలియన్ పోలీసులపై (Battalion Police) ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీచేశారు. క్రమశిక్షణ శాఖలో పనిచేస్తూ ఆందోళనలు నిర్వహించడంతో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఆందోళనకు కారణమైన వారిని, రెచ్చగొట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వం చర్యలపై బెటాలియన్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సస్పెండ్ చేసిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బెటాలియన్లలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నల్లగొండలోని 12వ బెటాలియన్లో కానిస్టేబుళ్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. శాంతియుతంగా ధర్నా చేస్తున్న కానిస్టేబుల్స్ని అకారణంగా సస్పెండ్ చేశారని తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏక్ పోలీస్ విధానాన్ని రద్దుచేసి పోలీసులకు న్యాయం చేయాలన్నారు. అదేవిధంగా వరంగల్ జిల్లా మామునూరు ఫోర్త్ బెటాలియన్లో కూడా పోలీసులు ధర్నా నిర్వహించారు. సస్పెన్షన్ ఎత్తివేసి, ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలన్నారు. విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
సస్పెన్షన్కు గురైన వారిలో 3వ బెటాలియన్కు చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లు, 4వ బెటాలియన్లో ఆరుగురు, 5వ బెటాలియన్లో ఆరుగురు, 6వ బెటాలియన్లో ఐదుగురు, 12వ బెటాలియన్లో ఐదుగురు, 13వ బెటాలియన్లో ఐదుగురు, 17వ బెటాలియన్లో ఆరుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.