దర్శకుల విలువను పెంచిన దర్శక దిగ్గజం దర్శకరత్న దాసరి నారాయణరావు సినీ పరిశ్రమ కోసం ఎనలేని కృషి చేశారు. ఆయనకు ప్రభుత్వం నుండి తగిన గుర్తింపు రాకపోవడంపై మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు 74వ జయంతి సందర్భంగా ఆయనకు నా స్మృత్యంజలి. విజయాలలో ఒకదాన్ని మించి మరో చిత్రాన్ని అపూర్వ దర్శకత్వ ప్రతిభతో మలచడమే కాదు, నిరంతరం చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మార్గదర్శకమేనన్నారు చిరంజీవి. దాసరికి ఇప్పటికీ తగిన ప్రభుత్వ గుర్తింపు రాకపోవడం తీరని లోటు. ఆయనకు పోస్త్మస్గానైనా విశిష్టమైన పద్మ పురస్కారం దక్కితే అది మొత్తం తెలుగు పరిశ్రమకు దక్కే గౌరవం అవుతుందని చిరంజీవి తన ట్వీట్లో వెల్లడించారు.
40ఏళ్లకు పైగా సినీ ప్రస్థానం, 151 చిత్రాలకు దర్శకత్వం, 54 సినిమాల నిర్మాణం..250 చిత్రాలకు సంభాషణలు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గడించిన దాసరి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.. ‘తాతా మనవడు’ సినిమాతో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం …అదే తాతా మనవడు నేపథ్యంలో తెరకెక్కిన ‘ఎర్రబస్సు’ ముగియడం విషాదకరం. మే 4 న జన్మించిన దాసరి మే 30వ తేదీన కన్నుమూశారు. అయితే దాసరి పుట్టిన రోజైన మే 4ని డైరెక్టర్స్ డే గా దర్శకులు జరుపుకుంటూ వస్తున్నారు.