స్వల్ప లక్షణాలు ఉంటే సీటీస్కాన్ వద్దు
శరీరంపై రేడియేషన్ దుష్ర్పభావం
క్యాన్సర్ సోకే ముప్పు: రణ్దీప్ గులేరియా
న్యూఢిల్లీ, మే 3: కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నా కూడా చాలా మంది సీటీ స్కాన్ చేయించుకోవడం పట్ల ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. పదేపదే సీటీస్కాన్ చేసుకోవడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందన్నారు. సీటీ స్కాన్ రేడియేషన్ శరీరంపై దుష్ర్ఫభావం చూపుతుందని చెప్పారు. ‘ఒక్క సీటీస్కాన్ 300-400 ఎక్స్రేలతో సమానం. యుక్త వయస్సులో సీటీస్కాన్ చేసుకొంటే తరువాత కాలంలో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం పెరుగుతుందని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. అందుకే కరోనా లక్షణాలు స్వల్పంగా ఉంటే సీటీ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. ఆక్సిజన్ స్థాయి పడిపోవడం, అలసట, ఛాతీలో నొప్పి ఉంటే దవాఖానలో చేరాలి’ అని సూచించారు.