అందుకే రీకౌంటింగ్కు ఆదేశించలేదు
నందిగ్రామ్ ఫలితంపై కోర్టుకెళతా: మమత
సీఎంగా రేపు దీదీ ప్రమాణం
కోల్కతా, మే 3: నందిగ్రామ్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రాణభయంతోనే రీకౌంటింగ్కు ఆదేశించలేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. నందిగ్రామ్ ఎన్నికల ఫలితంపై కోర్టుకు వెళతానని విలేకరుల సమావేశంలో ఆమె మరోసారి చెప్పారు. నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో స్వల్పతేడాతో మమత ఓడిన విషయం తెలిసిందే. ఓ ఉన్నతాధికారికి ఆ రిటర్నింగ్ అధికారి పంపిన ఎస్ఎంఎస్ను మమత బహిర్గతం చేశారు. రీకౌంటింగ్కు ఆదేశిస్తే తాను తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చని ఆ ఎస్ఎంఎస్లో రిటర్నింగ్ అధికారి ఆందోళన వ్యక్తం చేశారని మమత పేర్కొన్నారు. ఈసీ సాయం చేసి ఉండకపోతే రాష్ట్రంలో బీజేపీకి 50 సీట్లు కూడా వచ్చేవి కాదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నుంచి ఆనవాయితీగా అభినందన ఫోన్ రాలేదని తెలిపారు. మరోవైపు, సీఎంగా మమత బుధవారం ప్రమాణం చేస్తారని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. సోమవారం ఆమె రాష్ట్ర గవర్నర్ను కలిశారు.