ఖమ్మం, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్వరాష్ట్రం వచ్చాకే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకొన్నదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు. శనివారం ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఖమ్మంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ రంగంలో ఖమ్మం రాష్ట్రంలోనే ఐదో స్థానంలో నిలిచిందని అన్నారు.
హైదరాబాద్కే పరిమితమయ్యే ప్రాపర్టీ షోలు ఇప్పుడు ఖమ్మంలోనూ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రవాణా మంత్రి పువ్వాడ ప్రత్యేక చొరవతో నగరం సర్వతోముఖాభివృద్ధి చెందిందన్నారు. ప్రాపర్టీ షో నిర్వహిస్తున్న ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ యాజమాన్యాలకు అభినందనలు తెలిపారు. నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ విజన్తోనే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఆదరణ పెరిగిందని అన్నారు.
సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ టీఎస్ బీపాస్ తీసుకొచ్చి నిర్మాణాలకు సులువుగా అనుమతులు వచ్చేలా చేశారని కొనియాడారు. నమస్తే తెలంగాణ యాడ్స్ జీఎం సురేందర్రావు మాట్లాడుతూ.. టీఎస్ బీపాస్తో తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు తీస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ విజయ్కుమార్, ఖమ్మం మేయర్ పీ నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, ‘నమస్తే’ బ్రాంచి మేనేజర్ రేనా రమేశ్, బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్, ఎడిషన్ ఇన్చార్జి కాయల పూర్ణచందర్, డీజీఎం రాజిరెడ్డి, యాడ్స్ మేనేజర్ శేఖర్బాబు, సర్క్యులేషన్ ఏసీఎం రాంబాబు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, శ్రీబాలాజీ ఎస్టేట్స్ సీఎండీ వత్సవాయి రవి, శ్రీనిధి ఎన్క్లేవ్ సీఎండీ ఉన్నం జగన్, ఖమ్మం వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రాపర్టీ షోకు విశేష స్పందన
ఖమ్మం, హైదరాబాద్కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, బ్యాంకర్లు ఏర్పాటు చేసిన 30 స్టాళ్లను వందలాది మంది ప్రజలు సందర్శించారు. షోకు వచ్చిన వారితో ఫంక్షన్హాల్ కిటకిటలాడింది. రెండో రోజైన ఆదివారం కూడా ప్రాపర్టీ షో కొనసాగనున్నది.