Medigadda Barrage | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత ప్రభుత్వ ఆనవాళ్లేవీ లేకుండా చేస్తామని అసెంబ్లీలోనే ప్రకటించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, అన్నట్టుగానే పని మొదలుపెట్టినట్టు కనిపిస్తున్నది. బీఆర్ఎస్పై రాజకీయ కక్షసాధింపు కోసం విలువైన తెలంగాణ సంపదను మట్టిపాలు చేసే కుట్రలు జరుగుతున్నట్టు తెలంగాణవాదులు అనుమానిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటినుంచీ అక్కసు వెళ్లగక్కుతున్న కాంగ్రెస్ పార్టీ.. మేడిగడ్డ బరాజ్ కుంగుబాటును సాకుగా చూపి మొత్తం ప్రాజెక్టునే మట్టిలో కలిపేయాలని ప్రయత్నిస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆ ప్రాజెక్టులోని బరాజ్లకు ఎలాంటి నిర్వహణ, మరమ్మతులు చేపట్టకుండా వదిలివేసి.. నదికి వరదలు వచ్చినప్పుడు అవి కొట్టుకొనిపోయేలా చేసేందుకు కుట్రలు జరుగుతున్నట్టు అనుమానిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం సాగిన కాంగ్రెస్ పాలనలో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టుల్లో మేడిగడ్డ లాంటి ప్రమాదాలు కోకొల్లలు జరిగాయి. కానీ, వాటిని తొక్కిపెట్టి ఇప్పుడు కేవలం రాజకీయ కక్ష తీర్చుకొనేందుకే ప్రజల ఆస్తులను ధ్వంసం చేసేందుకు కూడా రేవంత్రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని నిపుణులు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ గొప్పగా చెప్పుకునే నాగార్జునసాగర్ కుడి హెడ్రెగ్యులేటర్ 1980వ దశకంలో కుంగిపోయింది. ఎన్టీఆర్ ప్రభుత్వం ఆ లోపాన్ని సరిచేసి రైతులకు సాగునీరు అందించింది. అప్పుడు ఎన్టీఆర్ రాజకీయమే పరమావధి అనుకుంటే మరమ్మతులు చేయకుండా లక్షల మంది రైతులను పణంగా పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసి ఉండొచ్చు. కానీ అలా చేయలేదు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ జలయజ్ఞం కింద చేపట్టింది. ప్రాజెక్టులోని ఎల్లూరు పంప్హౌజ్లోకి వరద నీరు వచ్చి పంపులన్నీ కుప్పకూలిపోయాయి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు అధిగమించి ఆ లోపాలను సరిచేసి ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. రెండు లక్షల ఎకరాల్లో పాలమూరు బిడ్డలు సిరులు పండించేలా చేసింది. ఇక్కడా కేసీఆర్ ప్రభుత్వం రాజకీయమే చేయాలనుకుంటే పాలమూరు పచ్చబడేదా?
కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ సహా జలయజ్ఞం కింద చేపట్టిన అనేక పెండింగ్ ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం తొలి రెండుమూడేండ్లలోనే రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది. అవి పూర్తిచేస్తే కాంగ్రెస్కే పేరు వస్తుందని కేసీఆర్ రాజకీయ కుంచితత్వంతో ఆలోచన చేసి ఉంటే ధాన్య సిరుల్లో తెలంగాణ నంబర్వన్గా నిలిచేదా?
ఇదే కాంగ్రెస్ హయాంలో దేవాదుల టన్నెల్ కుప్పకూలి పలువురి ప్రాణాలు పోయాయి. అయినా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ లోపాలను గుర్తించి మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాయి. ఇప్పుడు రేవంత్ సర్కారు మాత్రం తెలంగాణ రైతును రాజకీయ బలిపీఠంపై నిలిపింది. అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా మేడిగడ్డ లోపం ఏందో నిగ్గు తేల్చకుండా, బాధ్యులపై చర్యలు తీసుకోకుండా, కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నది. ‘కాళేశ్వరంపై విచారణకు సిద్ధమే… లోపమేందో గుర్తించి, బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకోండి’ అని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీలోనే సీఎంకు చెప్పారు. అయినా సమగ్ర విచారణపై రేవంత్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేయడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ మాత్రమేనన్న భ్రమలో నీటి నిల్వలు ఉన్నా సాగు ప్రణాళికను విస్మరించారు. ‘ఇప్పుడు నీటిని ఎత్తిపోస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు పేరు వస్తుందనే ఆలోచిస్తున్నారుగానీ… నీటిని ఎత్తిపోయకుంటే గత ఏడాదిని బేరీజు వేసుకొని రేవంత్ సర్కారు రాగానే పొలాలు ఎండబెట్టారనే అపవాదు వస్తుంది’ అనే చిన్న లాజిక్ను మాత్రం మిస్సవుతున్నారు.
లాజిక్ లేని విజిలెన్స్ నివేదిక
మేడిగడ్డపై విచారణ చేసిన విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో కొన్ని వివరాలు గందరగోళంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎగ్జిక్యూట్ మాత్రమే చేస్తారు. ఏజెన్సీతో ఒప్పందం చేసుకునేది ఎస్ఈ. ఈ క్రమంలో ఎస్ఈ ఇచ్చే కంప్లిషన్ సర్టిఫికెట్ చెల్లుతుంది గానీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇచ్చే కంప్లిషన్ సర్టిఫికెట్ ఎలా చెల్లుతుందనేది నివేదిక రూపొందించిన వారే చెప్పాలి. అసలు ఎందుకు కుంగిందనేదానిపై నిర్దిష్టమైన కారణాలు నివేదికలో లేవని నిపుణులు అంటున్నారు. కుంగుబాటుకు కారణాలేమిటి? దానికి బాధ్యులెవరు? అనే కనీస ముక్తాయింపు (కన్క్లూజన్స్) లేకుండా విజిలెన్స్ నివేదిక ఉన్నదని చెప్తున్నారు. దీంతో విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే పరిస్థితి కూడా లేదని సాగునీటి రంగ నిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు. అంటే రెండు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఏమీ తేల్చలేదని స్పష్టమవుతున్నది. వాస్తవానికి ఇప్పటికే ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ నిపుణులను రప్పించి బరాజ్పై ఏం చేయాలి? అనే దానిపై నివేదిక తీసుకోవాల్సి ఉన్నది. కానీ ప్రభుత్వానికి దానిని పునరుద్ధరించకుండా రాజకీయ డ్రామా నడిపే వేదికగా మాత్రమే వినియోగించుకోవాలనే ఆలోచన ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకో ప్రమాదకరమైన అడుగులు కూడా వేసేందుకు రేవంత్ ప్రభుత్వం వెనుకడుగు వేయడంలేదని పలువురు ఇంజినీర్లు అనుమానిస్తున్నారు. మరమ్మతులు చేయకుండా బరాజ్ను అలాగే వదిలివేయడం ద్వారా రానున్న వర్షాకాలం సీజన్లో భారీ వరదలు వచ్చి మరింత కుంగి, కొట్టుకుపోయేలా చేస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని మరింత బద్నాం చేయొచ్చనే కుట్ర కూడా జరుగుతున్నదని అంటున్నారు. దీంతో రైతుల ప్రయోజనాలు, ప్రజల ఆస్తులను రక్షించాలనే ప్రాథమిక బాధ్యతను సైతం విస్మరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికీ మేడిగడ్డ వద్ద ప్రవాహం
ఇప్పటికీ మేడిగడ్డ వద్ద ప్రాణహితలో ప్రవా హం కొనసాగుతున్నది. శనివారం మధ్యా హ్నం కూడా 6,210 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ఈ క్రమంలో మేడిగడ్డ నుంచి అన్నారం అటు నుంచి సుందిల్లకు నీటిని ఎత్తిపోసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతెందుకు.. పొద్దునలేస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే వీఆర్ఎస్ తీసుకున్న ఒక ఐఏఎస్ కూడా బరాజ్ లేకుండా నీటిని లిఫ్టు చేయొచ్చు అని గతంలోనే సెలవిచ్చారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన దేవాదుల ప్రాజెక్టులో కూడా ఎలాంటి నిల్వ లేకుండా కేవలం ఇన్టేక్ పాయింట్ వద్ద చిన్నపాటి గుంతలో నీటిని నిల్వ చేసి ఎత్తిపోశారు. దీంతో ఇప్పుడు మేడిగడ్డ వద్ద కూడా నీటిని ఎత్తిపోసేందుకు సాంకేతికంగా అవకాశాలున్నాయి. ఎలాగూ అన్నారంలో 2.56 టీఎంసీలు, సుంద్లిలలో 2.13 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. రానున్న వేసవిలో సాగు, తాగునీటికి ఎల్లంపల్లి, మిడ్మానేరు, ఎల్ఎండీ కీలకం కానున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు వాటిలో నిల్వలు పెంచుకోవడం, దిగువ వరకు చెరువులు నింపుకొంటే వచ్చే వానాకాలం వరకు ఎలాంటి సమస్య ఉండదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది కూడా ఇదే. అందుకే మండు వేసవిలో కూడా చెరువుల్లో జలసిరి కనిపించింది. ఈ వాస్తవం తెలిసినా అలా చేస్తే కేసీఆర్ ప్రభుత్వానికి పేరు వస్తుందనే దుగ్ధతో రేవంత్ సర్కారు తెలంగాణ రైతుల ప్రయోజనాలను పణంగా పెడుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రకటించి వెనక్కి తగ్గిన అధికారులు
రేవంత్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రైతుల నడ్డి విరుస్తున్నదనేందుకు సాగునీటి ప్రణాళిక-అమలే ఉదాహరణ. ప్రతి సీజన్కు ముందు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ప్రాజెక్టులవారీగా నీటి నిల్వలు, తాగునీటి అవసరాలు, డెడ్స్టోరేజీ వంటివి బేరీజు వేసుకొని ఆయా ప్రాజెక్టుల కింద ఎంత ఆయకట్టుకు సాగునీరు ఇస్తామనేదానిపై సివం (స్టేట్లెవల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ మేనేజ్మెంట్) సమావేశంలో చర్చించి, నిర్ణయిస్తారు. దానికి అనుగుణంగానే సాగునీటి విడుదల ఉంటుంది. గత నవంబర్లోనే యాసంగికి సంబంధించి ఎస్సారెస్పీ స్టేజ్-1లో పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని ప్రకటించారు. కానీ రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాత్రం స్టేజ్-1 కింద ఉన్న మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించడం గమనార్హం. పైగా స్టేజ్-2కు కూడా అరకొరగానే సాగునీటిని అందిస్తున్నారు. అంటే రేవంత్ ప్రభుత్వం కొలువుదీరిన రోజు నుంచి ఉద్దేశపూర్వకంగా ఎస్సారెస్పీ కింద ఉన్న ఆయకట్టును ఎండబెడితేనే కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయొచ్చనే దురాలోచన చేస్తున్నట్టుగా అర్థమవుతున్నది.
ఆదినుంచీ కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా బదనాం చేయాలని రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదనే అనుమానాలు ఉన్నాయి. శనివారం అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో అది బట్టబయలైంది. కాళేశ్వరం ప్రాజెక్టును నిరర్ధక ఆస్తిగా భావిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల
బరాజ్లు మాత్రమే కాదనే వాస్తవాన్ని మాత్రం ప్రభుత్వం గుర్తించడం లేదు.
కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం నిరర్ధక ఆస్తిగా భావిస్తున్న దరిమిలా… మున్ముందు చేపట్టే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో కాళేశ్వరంలో అంతర్భాగమైన నిర్మాణాలను వినియోగించబోమనే ప్రకటన కూడా చేసి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయిన లక్ష్మి, గాయత్రి పంప్హౌజ్లు, మిడ్మానేరు, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ వంటివి కూడా నిరర్ధక ఆస్తులు అయినందున వాటితో నిమిత్తం లేకుండానే ప్రాణహిత-చేవెళ్లను ముందుకు తీసుకుపోతే తెలంగాణ సమాజం హర్షిస్తుందని అంటున్నారు.
చెరగని ముద్ర.. చెరిపేసే కుట్ర
‘కాళేశ్వరంపై విచారణకు సిద్ధమే… లోపమేందో గుర్తించి, బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకోండి’ అని మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీలోనే సవాల్ విసిరినా సమగ్ర విచారణపై రేవంత్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేయడం లేదు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమేనన్న భ్రమలో ఉన్న సర్కారు నీటి నిల్వలు ఉన్నా సాగు ప్రణాళికను విస్మరించింది. నీటిని ఎత్తిపోస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు పేరు వస్తుందనే ఆలోచిస్తున్నారుగానీ…పొలాలు ఎండబెట్టారనే అపవాదు వస్తుంది అనే చిన్న లాజిక్ మిస్సవుతున్నారు.
కాళేశ్వరం జలాలను ఎత్తిపోసే అవకాశం ఉన్న దరిమిలా పంటలు వేసుకున్న వారికి చివరి దశలో పది టీఎంసీలనైనా ఇద్దామని ఇంజినీర్లు మంత్రి ఉత్తమ్కు సూచించగా.. ఇదే విషయాన్ని సీఎం ముందు ప్రస్తావించినట్టు సమాచారం. ‘అలా చేస్తే కాళేశ్వరం రన్నింగ్లో ఉన్నట్టు అవుతుంది.. దానిని ముట్టుకోకండి!’ అని రేవంత్ తెగేసి చెప్పినట్టు తెలిసింది. దీన్ని బట్టి కాళేశ్వరంతో చుక్క కూడా ఎత్తిపోయడం లేదని ప్రచారం చేసుకోవాలనే దురాలోచన ఉన్నట్టు స్పష్టమవుతున్నది.
బడ్జెట్లో బట్టబయలు
శనివారం అసెంబ్లీ వేదికగా ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కాళేశ్వరం ప్రాజెక్టును నిరర్ధక ఆస్తిగా భావిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజ్లు మాత్రమే కాదనే వాస్తవాన్ని మాత్రం ప్రభుత్వం గుర్తించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును నిరర్ధక ఆస్తిగా భావిస్తున్న దరిమిలా… మున్ముందు చేపట్టే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో కాళేశ్వరంలో అంతర్భాగమైన నిర్మాణాలను వినియోగించబోమనే ప్రకటన కూడా చేసి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ హయాంలో పూర్తయిన లక్ష్మి, గాయత్రి పంప్హౌజ్లు, మిడ్మానేరు వంటివి కూడా నిరర్ధక ఆస్తులు అయినందున వాటితో నిమిత్తం లేకుండానే ప్రాణహిత-చేవెళ్లను ముందుకు తీసుకుపోతే తెలంగాణ సమాజం హర్షిస్తుందని అంటున్నారు.
సీఎం స్థాయిలోనే కుట్ర?
కాళేశ్వరం ప్రాజెక్టులో గోదావరిజలాలను ఎత్తిపోసే అవకాశం ఉన్న దరిమిలా రానున్న వేసవిలో సమస్య తలెత్తకుండా, పంటలు వేసుకున్న వారికి చివరి దశలో సాగునీటి సమస్య రాకుండా పది టీఎంసీలనైనా ఎత్తిపోసుకుందామని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి సూచించినట్టు తెలిసింది. ఇది నిజమే కదా..అనుకొని మంత్రి ఉత్తమ్ ఇదే విషయాన్ని సీఎం రేవంత్ ముందు ప్రస్తావించినట్టు సమాచారం. అయితే అలా చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు రన్నింగ్లో ఉన్నట్టు అవుతుంది.. అందుకే దానిని ముట్టుకోకండి! అని సీఎం రేవంత్రెడ్డి తెగేసి చెప్పినట్టు తెలిసింది. అంటే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా… ఉద్దేశపూర్వకంగా దానిని పక్కన పడేయడం వల్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరంతో ఒక చుక్క కూడా ఎత్తిపోయడం లేదని రాజకీయంగా ప్రచారం
చేసుకోవాలనే దురాలోచన ఉన్నదనేది స్పష్టమవుతున్నది.
ప్రజలు అంత అమాయకులా?
మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు, బాధ్యులు, చర్యలు.. ఈ కోణంలో రాష్ట్ర ప్రభుత్వ అడుగులు పడాల్సి ఉండగా, కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బ కొట్టేందుకు రేవంత్ ప్రభుత్వం దుస్సాహసం చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కేసీఆర్ ఇంజినీర్లా రూపొందించిన మేడిగడ్డ కుంగిపోయిందంటూ వెటకారాలు దట్టిస్తున్నారు. వాస్తవానికి సీఎం, మంత్రులు రూట్మ్యాప్ ఇస్తే, అధికారులు దానిని అమలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి స్వయంగా సెలవిచ్చారు. ఈ క్రమంలో రీడిజైనింగ్లో భాగంగా మేడిగడ్డ వద్ద బరాజ్ ఖరారైన తర్వాత అక్కడి నుంచి ఎల్లంపల్లికి జలాలను తరలించడంపై వ్యాప్కోస్ రాడార్ సర్వే చేపట్టింది. ఈ అలైన్మెంట్లో 22 క్లిష్టమైన పాయింట్స్ ఉన్నట్టు తేలింది. పెద్దపల్లి నుంచి మంథని కొత్త రహదారి, మేరుపల్లి, గుంటూరుపల్లి, రుద్రారం, చిన ఓదాల, పెద్ద ఓదాల, గోపాలపురం, రామకృష్ణాపురం, రామాపురం, రత్నాపూర్, ఇత్వార్పేట్, గుండారం, సబితారం, రనపురం, బ్రాహ్మణపల్లి, రాగేందర్, కొత్తపల్లి, పాలకుర్తి, బాక్రావ్పల్లి, పుత్నూరు, మానేరు నదిని క్రాస్చేసే చోట కష్టతరంగా ఉన్నదని గుర్తించారు. దీంతో ఎలా ముందుకుపోవాలనే దానిపై జరిగిన మథనంలో అప్పటి సీఎం కేసీఆర్ నదీమార్గంలోనే ఎగువకు తరలిస్తే నిత్యం నదిలో జలసిరి ఉండటంతో పాటు భూసేకరణ వంటి కీలక అడ్డంకి ఉండదని సూచించారు. దీంతోపాటు నిత్యం జీవనదిలా ఉండటం వల్ల పర్యాటకం, మత్స్యసంపద.. ఇలా వివిధ రంగాలకూ జీవం పోసినట్టవుతుందనే సదుద్దేశంతో ఈ డిజైన్ను ఖరారు చేశారు.
విశ్రాంత ఇంజినీర్ హన్మంతరావుతో పాటు సీడబ్ల్యూసీ చైర్మన్, ఇతర నిపుణులు ఎందరో దీనిని ప్రశంసించారు. అయితే ఈ ఆలోచనను సాంకేతికంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత ఇంజినీర్లపై ఉంటుంది. ఈ క్రమంలో లోపం తలెత్తినపుడు అదెందుకు జరిగింది? దానికి బాధ్యులెవరు? అనే దానిపై దృష్టిసారించి చర్యలు తీసుకోవాలిగానీ కేసీఆర్ స్ట్రక్చరల్ ఇంజినీర్, ఆ ఇంజినీర్, మేడిగడ్డ కుంగిందంటూ రేవంత్రెడ్డి పదేపదే వ్యంగ్యంగా వ్యాఖ్యానించి, కేసీఆర్ ప్రతిష్ఠను తగ్గించాలనే విఫలయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్ముందు రేవంత్రెడ్డి కూడా తన విజన్ను వివరించి, అధికారుల ద్వారా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తలెత్తే లోపాలకు ఆయనే పూర్తిస్థాయి బాధ్యత వహిస్తారా? రెండు రోజుల కిందట అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ… ఔటర్ రింగు రోడ్డు వరకు అర్బన్, ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు సెమీ అర్బన్, ఆపై గ్రామీణం అంటూ తన అభివృద్ధి విజన్ను వివరించారు. మరి రేవంత్రెడ్డి అర్బన్ డెవలప్మెంట్ విభాగ నిపుణుడేమీ కాదు. సివిల్ ఇంజినీర్ అంతకంటే కాదు. భవిష్యత్తులో ఈ విజన్ విజయవంతమైతే తానే రూపకర్తను అని చెప్పుకుంటారనడంలో సందేహం లేదు. నేదురుమల్లి జనార్ధన్రెడ్డి చేసిన శంకుస్థాపనతో సైబర్ టవర్ నిర్మించి, ఐటీ రంగంలో హైదరాబాద్ను తానే ప్రపంచ పటంలో పెట్టానన్న ఓ నేత మాటలు ఇంకా మన చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. అంతమాత్రాన సదరు నాయకుడు ఐటీ రంగ నిపుణుడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఏమీ కాదు.. ఐటీ కంపెనీ సీఈవో అంతకన్నా కాదు అని నిపుణులు గుర్తుచేస్తున్నారు.