హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : టీచర్ల పదోన్నతుల విషయంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకొన్నది. స్కూల్ అసిస్టెంట్ పదోన్నతికి టెట్ ఉత్తీర్ణతను తప్పనిసరిచేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. టెట్ పేపర్ -2లో పాసైన వారికే స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు కల్పించాలని పేర్కొన్నది. దీంతో తాజాగా పదోన్నతి పొందే టీచర్లంతా టెట్లో క్వాలిఫై కావడం తప్పనిసరి అయింది. రాష్ట్రంలో 2011 నుంచి టెట్ అమలు చేస్తున్నారు. అయితే, 2010 ఆగస్టు 23కి ముందే సర్వీసులో చేరిన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
అయితే, సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)లు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందాలంటే టెట్లో క్వాలిఫై కావాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. పదోన్నతులు ప్రక్రియ కొనసాగుతుండగా హైకోర్టు తీర్పునివ్వడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.03లక్షలకు పైగా టీచర్లు పనిచేస్తుండగా, వీరిలో అత్యధికులు టెట్లో క్వాలిఫై కాలేదు. దీంతో పదోన్నతులు దక్కే అవకాశాలు అతి స్వల్పంగా ఉంటాయి. ఇదే విషయమై విద్యాశాఖ అధికారులను వివరణ కోరగా, హైకోర్టు తీర్పు విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు తగు నిర్ణయం తీసుకొంటామని వెల్లడించారు.
స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పదోన్నతికి టెట్ ఉత్తీర్ణత ఉండాలనడం విచారకరమని, ఈ తీర్పును పున ః సమీక్షించాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్రావులు కోరారు. తాజా ఉత్తర్వులతో పదోన్నతుల కోసం ఎనిమిదేండ్లుగా వేచిచూస్తున్న టీచర్లకు అన్యా యం జరుగుతుందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధానకార్యదర్శి చావ రవిలు పేర్కొన్నారు. ఈ తీర్పుపై పున ః సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేయాలని విజ్ఞప్తిచేశారు.