Farmers | అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకొన్నది. ఉచిత కరెంటు వద్దన్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నోటికాడిబుక్కను ఎత్తగొట్టే కాంగ్రెస్ ఆలోచనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ దిష్టిబొమ్మలు దహనం చేసి తమ కోపాగ్నిని ప్రదర్శించారు. రైతు వ్యతిరేక ఆలోచనలను బూడిద చేస్తామంటూ హెచ్చరించారు. 3 గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ను గ్రామాల్లోకి రానిచ్చే ప్రసక్తే లేదని పొలిమేర్లలో బోర్డులను ఏర్పాటుచేశారు. ఆ పార్టీకి ఓటు వేయబోమని తీర్మానాలు చేశారు. 24 గంటల కరెంటిచ్చి సాగును కేసీఆర్ పండుగగా మార్చితే.. ఈ కాంగ్రెసోళ్లు రైతుల పొట్ట కొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంటు ఇస్తాననడం సరైంది కాదు. ఎవుసం చేసేందుకు ఎన్నో కష్టాలు పడ్డం. పురుగనక, పుట్రనక రాత్రిపూట వచ్చి బాయిల కాడ పండుకునేది. ఎప్పుడు కరంటు వత్తదో, పోతదో తెల్వదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే ఇంత పంట పండిచ్చుకుంటున్నం. ఇప్పుడచ్చే కరంటు మాకు సరిపోతాంది. రేవంత్రెడ్డికి ఎవుసం తెలిస్తే గంటకు ఎకరం నీళ్లు పారిచ్చి సూపెట్టాలె. ఆయన ఈ ముచ్చట ఎందుకన్నడో నాకైతే తెల్వదు కానీ పాత రోజులు మల్ల అత్తె రైతుల బతుకు ఆగమైపోతది. నిజం చెప్పుకోవాల్నంటే కేసీఆర్ అచ్చినంకనే రైతులు బాగుపడ్డరు. రోజూ పొద్దుగాళ్ల నౌకరికి పోయినోళ్లలెక్క మేము కూడా తెల్లారంగానే బాయికాడికచ్చి పనులు చూసుకొని సాయంత్రం ఇంటికి పోతానం. 3 గంటల కరంటు ఎడ్ల పెయ్యి కడిగేతందుకూ సరిపోదు. ఎండ్రిన్ తాగి సచ్చిపోవుడే అయితది.
– పొల్నేని వెంకట్రావు, రైతు, గోపాల్పూర్, ఎల్కతుర్తి మండలం, హనుమకొండ జిల్లా
రేవంత్రెడ్డి అన్నట్లు మూడు గంటల కరెంటిస్తే మూడు గుంటల పొలమే పారుతది. మూడు గంటల కరెంట్తో గ్యాపు ఇచ్చే బోర్లకు మూడు గుంటల పొలమే పారుతది. మూడుగంటల పొలం పారుతే రైతులెట్ల బతుకుతరు. రేపు పిల్లలనెట్ల సాదుకుంటరు. పిల్లలనెట్ల సదువుపిత్తరు. ఎన్నో ఇబ్బందులుంటయి. భార్యాభర్తలు కూడా బతుకలేరు. మొన్న పడ్డట్టు రాళ్ల వానపడితే మూడు గుంటల పొలం పెట్టిన రైతుల పరిస్థితి ఎట్లుంటది. 24గంటల కరెంట్తోటే మేము బతుకుతున్నం. రేవంత్రెడ్డి చెప్పిన ముచ్చట మాకు కల్వది. మూడు గంటల కరెంట్ అంటే మాకు చాలా ఇబ్బందయితది.
-దాసరి ప్రభాకర్, రైతు, బైరాన్పల్లి, ధూళిమిట్ట మండలం, సిద్దిపేట జిల్లా
24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని రేవంత్రెడ్డి మాట్లాడడం మా రైతులను బాధిస్తున్నది. కేసీఆర్ సర్కారు అచ్చినంక కరెంటు కష్టాలు తీరినై.తెల్లందాక తోటల కాడ నిద్ర లేకుంటా వడి సత్తుంటిమి. పురుగు బుసి కుట్టి సచ్చి పోవుడవుతుండే. గసుంటి పనికి మాసిన కరెంటును రైతుల కోసం ఎంత ఖర్సైనా ఎనుకకు రాకుంటా కేసిఆర్ మంచిగ జేసిండు. కన్ను మూసి తెర్సేంత సేపు సుక బందు గాని కరెంటును 24 గంటలు ఇచ్చుట్లనే గిప్పుడు మా ఇండ్ల కాడ వండుంటున్నం. మీరచ్చి గిట్ల మూడు గంటల కరెంటే ఇత్తమంటే మా ఎవుసాలు మల్ల ఎన్కటికి మీ కాలం నాటికి వోయినట్టే. రైతుల కోసం 24 గంటల కరెంటు ఇచ్చినోళ్లు కావాల్నే గాని వచ్చే కరెంటును చెడగొట్టే మాటలు మాట్లాడుతున్నడు రేవంత్రెడ్డి. 3 గంటల కరెంటే ఇయ్యాల. దాని తోని రైతులు మల్ల పెంక మీది కెల్లి పొయ్యిల వడాల. గిదేనా మీరు కోరుకునేది.
-బద్ధం దశరథ్ రెడ్డి, ఉప్లూర్, కమ్మర్పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా
ఆగమాగం జగన్నాథం అన్నట్లు ఉంటుండే మునుపటి కరెంటు. మీది మడి పారు వరకల్లా కింది మడి ఎండి పోతుండె. గిసుంటి ఎవుసం 24 గంటల ఉచిత కరెంటు తోటి మంచిగా కుదురుకున్నది. రైతులు సంతోషంగా ఉన్నరు. 24 గంటల కరెంటు అవసరం లేదని రేవంత్ రెడ్డి ఎందుకు అంటున్నరు. గిప్పుడు 24 గంటల కరెంటు వద్దంటే కుదురుకున్న మా ఎవుసం ఏం గావాలే. కాల్వల కెళ్లి మోటార్లతోటి ఎత్తి పోసుకునే మా భూములు ఏం కావాలే ? కేసీఆర్ అచ్చినంక మా గ్రామాల చెరువులు బాగు చేసిండు. మా గ్రామాల పొంటి పారుతున్న కాల్వలు బాగు జేసిండు. వరద కాల్వల ఎప్పుడు నిండా నీళ్లు ఉంచుతున్నడు. 24 గంటల ఉచిత కరెంటు అవసరం లేదంటే మా బోర్లు బావుల కింద మా ఎవుసం ఏం గావాలే ? పిస్స మాటలకు మేము ఆగమయ్యేదే లేదు. కేసీఆర్కు మంచి పేరు వస్తదని మంచి పథకాలపై విషం గక్కే కరెంటు రాజకీయం జేస్తే రైతులు తిక్క లేసి మల్లొక సారి కరెంటు షాక్ ఇస్తరు పైలం.
-ద్యాగ చిన్నయ్య, రైతు, రాజరాజేశ్వరి నగర్, కమ్మర్పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా
“పదేండ్ల కింద చీకట్లల్ల పొలానికి కరెంట్ నీళ్లు పెట్టుకున్నట్లు ఇప్పుడు పెట్టుకోమంటడా..? ఏంది రేవంత్రెడ్డి. కరెంట్ తిప్పలు తప్పినయి. అనుకుంటుంటే మళ్ల మూడు గంటలు సాలు. నాలుగు గంటల కరెంట్ సాలు అంటూ ముచ్చట మొదలు పెట్టిండు. ఇదేం పద్ధతి. కాంగ్రెసోళ్లు ఇప్పటికే రైతులను మస్తుసార్లు ముంచిండ్రు. ఇప్పుడు మళ్ల ముంచాలని సూతుండ్రు” అంటూ తన అభిప్రాయాయన్ని వ్యక్తం చేశాడు జగిత్యాల అర్బన్ మండలానికి చెందిన మోతె గ్రామానికి చెందిన రెండెకరాల రైతు రాచకొండ రాములు. “దగ్గరదగ్గర రెండెకరాల పొలం చేసుకొని బతుకుతున్నా. రేవంత్రెడ్డి మాటలు టీవీల చూసిన. అసలు ఆయనకు ఎవుసం ఏమైనా తెలుసా అని అనిపిస్తుంది. రేవంత్రెడ్డి మళ్ల రైతు అద్దరాత్రి పొలం కాడికి పోయేలా చేయాలని అనుకుంటున్నట్లు అనిపిస్తుందని అన్నారు.