ముషీరాబాద్, జూన్ 27: ఎస్సీ వర్గీకరణ సాధించిన ఉత్సాహంతో మాదిగలు రాజ్యాధికారం దిశగా పయనించాలని ప్రొఫెసర్ కాశీం అన్నారు. తమ ఓట్లు తామే వేసుకొనే పరిస్థితి ఏర్పడితే రాజ్యాధికారం సాధించడం సులభమవుతుందని తెలిపారు. శనివారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం విద్యానగర్లోని రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ.. ఒక్కో నియోజకవర్గంలో మాదిగలు నలభై వేల మంది ఓటర్లు ఉన్నారని, వారంతా ఒక్కతాటిపైకి వస్తే, ఒకే మాటగా పనిచేస్తే రాజ్యాధికారం సాధ్యమవుతుందని తెలిపారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.