రంగారెడ్డి, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ)/కందుకూరు : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామంలో మరో 300 ఎకరాల పట్టా భూముల సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా శుక్రవారం కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, తహసీల్దార్, టీజీఐఐసీ అధికారులతో గ్రామంలో రైతులతో గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫ్యూచర్సిటీ కోసం ముచ్చర్ల గ్రామంలో 300 ఎకరాలు సేకరిస్తామని అధికారులు తెలిపారు. ఫ్యూచర్సిటీ కోసం ఇప్పటికే ముచ్చర్లలోని ప్రభుత్వ భూములన్నింటినీ సేకరించగా, ఇప్పుడు వాటి పక్కనున్న 300 ఎకరాల పట్టా భూములను కూడా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫ్యూచర్సిటీ కోసం తమ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ ఇప్పటికే తీసుకొన్నారని, మళ్లీ పట్టా భూముల జోలికొస్తున్నారని, పట్టా భూముల జోలికొస్తే సహించేది లేదని రైతులు హెచ్చరించారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ పట్టా భూములు ఇవ్వబోమని, పట్టా భూముల జోలికొస్తే ఎంతటికైనా తెగిస్తామని మాజీ సర్పంచ్ లక్ష్మణ్తోపాటు పలువురు రైతులు తెగేసి చెప్పారు. ముచ్చర్ల గ్రామంలో ఉన్న రైతులంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఉన్న భూములన్నీ ఫ్యూచర్సిటీ పేరుతో బలవంతంగా తీసుకొంటే తాము ఎలా బతికాలని ప్రశ్నించారు. తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరిస్తే తమ పరిస్థితి ఏమిటని మండిపడ్డారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా తమ భూములను తీసుకుంటే తమకు చావే శరణ్యమని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ భూములతోపాటు 300 ఎకరాల పట్టా భూములను కూడా తీసుకొంటే ఇక తమకు మిగిలేదేమిటని ప్రశ్నిస్తున్నారు.
ముచ్చర్ల గ్రామంలో ప్రభుత్వం 300 ఎకరాలను సేకరించేందుకు గుర్తించిన సర్వే నంబర్ల వివరాలు.. 115, 121, 122, 131, 135, 137, 138, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 150, 151, 152, 153, 154 సర్వే నంబర్లను గుర్తించారు. ఇందులో 138లో 4.16 ఎకరాలు, 151లో 5.01 ఎకరాలు మాత్రమే సీలింగ్ భూమి ఉన్నది. మిగతా భూములన్నీ పట్టా భూములే. గతంలో ఫ్యూచర్సిటీకి సేకరించిన భూముల మధ్యలో కొంతభూమి, ఆ పక్కనే మరికొంత భూమి ఉండటం వలన ఈ భూములు సేకరించాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వం పట్టా భూములను కూడా ఎలాగైనా రైతులను ఒప్పించి తీసుకొనేందుకు నిర్ణయించింది.
భూసేకరణలో దాదాపు మొత్తం భూములను రైతులు కోల్పోతున్నారు. ఇప్పటికే ఈ గ్రామంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములను ఫ్యూచర్సిటీ కోసం ప్రభుత్వం సేకరించింది. తాజాగా, మరో 300 ఎకరాలను కూడా తీసుకొనేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ గ్రామంలో భూములు దాదాపు ఖాళీ కానున్నాయి. ఫ్యూచర్సిటీ పుణ్యమా అంటూ గ్రా మంలో ఉన్న భూములన్నీ ఖాళీ కావడంతో ఇకనుంచి వ్యవసాయం చేసుకోవాలంటే రైతులకు భూమి లేకుండా పోయింది. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు భూములు లేకపోవడంతో వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.