హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నెలన్నర తర్వాత పరిశ్రమలు మళ్లీ పూర్తిస్థాయిలో తెరుచుకుం టున్నాయి. లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోవడంతోపాటు రవాణా వ్యవస్థ గాడిలోపడటం, వలస కూలీలు తిరుగు ప్రయాణం కావడంతో సోమవారం నుంచి పరిశ్రమలు యథాస్థితికి చేరుకోనున్నాయి. గత నెల 12 నుంచి తెలంగాణలో లాక్డౌన్ విధించినప్పటికీ పరిశ్రమలకు కొన్ని మినహాయింపులు ఇచ్చిన విషయంవిదితమే. అయితే ఇతర రాష్ర్టా ల్లో కరోనా ఆంక్షల వల్ల ముడిసరుకు రవాణా నిలిచిపోవడం, వలస కార్మికులు సొంత ప్రాంతాలకు తరలిపోవడం, ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడం తదితర కారణాల వల్ల ఉత్పత్తులు అరకొరగానే సాగాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతా ల్లో 40 వేల పైచిలుకు పరిశ్రమలుండగా.. దాదాపు అన్నింటిపైనా లాక్డౌన్ ప్రభావం పడింది.
మహారాష్ట్ర, గుజరాత్రాష్ర్టాల్లో కరోనా ఉధృతి కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవటంతో ముడిసరుకు కొరత ఏర్పడింది. దాంతో చాలా పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపివేశారు. ఏప్రిల్, మే నెలల్లో వైద్య అవసరాలకు ఆక్సిజన్కు కొరత ఏర్పడటంతో ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్ పరిశ్రమలకు ఆక్సిజన్ను నిలిపివేశారు. దీంతో ఈ పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్రంలోని పరిశ్రమల్లో ఎక్కువగా బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ర్టాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం మొదలైనప్పటి నుంచి వీరు తమ సొంత ఊర్లకు బయలుదేరారు. ఈ కారణాల వల్ల చాలా పరిశ్రమలు పూర్తిస్థాయిలో పనిచేయలేదు.
ఇతర రాష్ర్టాల్లో పరిస్థితులు నియంత్రణలోకి రావడంతో అన్నిచోట్ల లాక్డౌన్ ఎత్తివేస్తున్నారు. మన రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలను పూర్తిగా తొలగించినప్పటికీ 20న ఆదివారం కావడంతో పరిశ్రమలు తెరుచుకోలేదు. సోమవారం నుంచి మళ్లీ యథావిథిగా ఉత్పత్తులు ప్రారంభమయ్యే అవకాశమున్నది. సొంత ప్రాంతాలకు వెళ్లిన కార్మికులు మళ్లీ తిరిగొస్తున్నారు. ఉత్తరాది నుంచి వచ్చే రైళ్లు కార్మికులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరా యథాస్థితికి చేరింది. ఇతర రాష్ర్టాల నుంచి ముడిసరుకు రాక కూడా మొదలైంది. పారిశ్రామిక ఉత్పత్తుల మార్కెంటింగ్కు అడ్డకుంలు పూర్తిగా తొలగిపోయాయి. దుకాణాలు తెరుచుకోవడంతో మార్కెట్ పుంజుకొనే అవకాశం ఉన్నది.
దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో లాక్డౌన్ ఆంక్షలు తొలిగిపోవడంతో త్వరలోనే పరిశ్రమలు పూర్వస్థితికి చేరుకోవచ్చని తెలంగాణ పరిశ్రమల సమాఖ్య (టీఐఎఫ్) అధ్యక్షుడు సుధీర్రెడ్డి తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో ఏర్పడిన అంతరాయాల వల్ల దాదాపు రెండు నెలల నుంచి ఇబ్బందులు పడుతున్న పరిశ్రమల్లో ఇప్పుడిప్పుడే పరిస్థితి నియంత్రణలోకి వస్తున్నదని చెప్పారు. మార్కెట్ యథాస్థితికి చేరుకుంటే ఉత్పత్తుల విక్రయాలు ఊపందుకుంటాయని, దీనికి మరికొంత సమయం పడుతుందని వివరించారు. కరోనా, లాక్డౌన్ కారణంగా పరిశ్రమలకు ఏర్పడిన నష్టాన్ని పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని సుధీర్రెడ్డి విజ్ఞప్తిచేశారు.