Paddy Seeds | హైదరాబాద్, మే 25(నమస్తే తెలంగాణ): రైతులకు విత్తనాల కొరత సమస్య మరింత పెరుగుతున్నది. ఇప్పటికే జనుము, జీలుగు, పత్తి విత్తనాల కోసం నానా తంటాలు పడుతున్న రైతులకు కొత్తగా వడ్ల విత్తనాల కొరత కూడా ఇబ్బంది పెడుతున్నది. ముఖ్యంగా సన్న వడ్ల విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు శుక్రవారం వ్యవసాయ యూనివర్సిటీ అధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమమే అద్దం పడుతున్నది. ఈ విత్తనమేళాలో సన్న వడ్ల రకాల విత్తనాల కోసం రైతులు ఎగబడ్డారు. కానీ సరిపడా విత్తనాలు లేకపోవడంతో వారికి నిరాశ తప్పలేదు. దీంతో రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి వెయ్యి నుంచి 1300 మంది రైతులు విత్తన మేళాకు వస్తుండగా ఈసారి మాత్రం ఈ సంఖ్య 2,800 వరకు ఉందని అధికారులు ప్రకటించారు. ఇందులో మెజార్టీ రైతులు సన్న ధాన్యం విత్తనాల కోసమే వచ్చినట్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా రైతులు తెలంగాణ సోనా(ఆర్ఎన్ఆర్), వరంగల్ సన్నాల కోసం డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. తెలంగాణ సోనా రకం విత్తనాలను గతేడాది యూనివర్సిటీ కేవలం 121 క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే విక్రయించగా, ఈ సీజన్లో ఇప్పటికే 482 క్వింటాళ్ల విత్తనాలను రైతులు కొనుగోలు చేసినట్టు తెలిపారు. మరో 5వేల క్వింటాళ్ల విత్తనాలు ప్రాసెసింగ్లో ఉన్నట్టు యూనివర్సిటీ తెలిపింది.
హామీ ఇచ్చారు.. విత్తనాలు మరిచారు
సన్నధాన్యం సాగు చేస్తే రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి సన్న రకాల ధాన్యం విత్తనాలను అందుబాటులో ఉంచడంలో విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వానాకాలం సీజన్లో 66 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని ఇందుకు 16.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సాధారణంగా అయితే ఇందులో 70 శాతానికి పైగా దొడ్డు ధాన్యం విత్తనాలే ఉంటాయి. అంటే కేవలం 30 శాతంలోపే సన్న రకం విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని సరిగ్గా సీజన్ ప్రారంభానికి ముందు ప్రకటించడంతో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ ఆలస్య ప్రకటనతో సన్న వడ్ల విత్తనాలకు కొరత ఏర్పడే పరిస్థితి నెలకొన్నది. బోనస్ ప్రకటనతో కొందరు రైతులు సన్న వడ్ల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ కొద్దిమంది రైతులకు కూడా విత్తనాలను అందించలేని పరిస్థితిలో ఉండటం గమనార్హం. వాస్తవానికి యూనివర్సిటీ అయినా, ప్రైవేటు కంపెనీలైనా గత ఏడాది ఉత్పత్తి ఆధారంగా(25-30శాతం) ఈ ఏడాదికి సన్న వడ్ల విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. కానీ, ప్రభుత్వం బోనస్ ప్రకటనతో సన్న వడ్ల విత్తనాలకు డిమాండ్ పెరిగి కొరత ఏర్పడింది. దీంతో ఇప్పుడు ఉత్పత్తి చేసి ఆ కొరత తీర్చే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడేం చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ మల్లగుల్లాలు పడుతున్నది.
బ్లాక్ మార్కెట్ దందా, ధరలకు రెక్కలు
ప్రభుత్వం సన్నాలకే రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో ప్రైవేటు కంపెనీలు బ్లాక్ దందాకు తెరలేపారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎలాగూ సన్నాలకు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి.. దీన్ని సొమ్ము చేసుకోవాలని కంపెనీలు, వ్యాపారులు కుట్రలు చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే సన్న రకాల విత్తనాలను బ్లాక్ చేసి పెట్టినట్టు సమాచారం. తద్వారా మార్కెట్లో విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టించి ఆ తర్వాత అధిక ధరకు విక్రయించేలా స్కెచ్ వేసినట్టు తెలిసింది. ఇదే జరిగితే రైతులకు విత్తనాల భారం తడిసి మోపెడవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ఆ 500 బోనస్ విత్తనాలకే సరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టి.. రైతులకు సకాలంలో సన్న రకం విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.