PM Modi | ఆదిలాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): అవినీతి, కుటంబ పాలనలో ఇండియా కూటమి నేతలు మునిగితేలుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తాను వారి కుటుంబపాలనపై సవాల్ విసురుతున్నందున మోదీకి పరివారం లేదని కూటమి నేతలు అంటున్నారని, దేశంలో కోట్లాది మంది ప్రజలు తనను కుటంబ సభ్యుడిగా ప్రేమిస్తారని అన్నారు. ‘మేరా భారత్ మేరా పరివార్’ అనే భావనతో జీవిస్తున్నానని తన జీవితం విచ్చుకున్న దారం లాంటిదని అన్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టాన్ని పాలించిన పార్టీలు వేర్వేరు కావచ్చని, కానీ వాటి చరిత్ర ఒకటేనని, ఒకటి జూటా అయితే రెండోది లూట్ సర్కార్ అని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అవినీతిపై విచారణ జరుపాల్సింది పోయి ఫైళ్లు మూసివేసిందని ఆరోపించారు. రామ మందిర నిర్మాణంలో బంగారు తలుపులు, ధ్వజస్తంభం నిర్మాణంలో తెలంగాణ పాత్ర ఉందని అన్నారు. దేశ ప్రజలు తెలంగాణ ప్రజలను అభినందిస్తున్నారని, రామ్లల్లా ఆశీర్వాదం తెలంగాణ ప్రజలపై ఉన్నదని చెప్పారు. తెలంగాణ భూమి రాంజీ గోండ్, కుమ్రం భీం లాంటి వీరులు జన్మించిన స్థలమని, కానీ గత ప్రభుత్వాలు వీరిని గుర్తించలేదని అన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆదివాసులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని, ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేశామని గుర్తుచేశారు. బిర్సాముండా జన్మదినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నామన్న ప్రధాని, గిరిజనుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామని చెప్పారు. హైదరాబాద్లో కడుతున్న మ్యూజియంకు రాంజీగోండ్ పేరు పెడుతామని చెప్పారు. సమక్క, సారక్క యూనివర్సీటీతోపాటు తెలంగాణ రాష్ట్రవాసుల కలగా ఉన్న పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ నినాదంతో ముందుకు పోతున్నాం. నేను మీ ప్రేమ కోసం తపిస్తున్నాను. ఒక సేవకునిగా పనిచేసే అవకాశం కల్పించండి’ అని అన్నారు.
ఇది ఎన్నికల సభ కాదని, ఇంకా ఎన్నికల ప్రకటన వెలువడలేదని మోదీ గుర్తుచేశారు. తాను తెలంగాణ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఉత్సవాలను జరుపుకునేందుకు వచ్చానని చెప్పారు. వికసిత్ భారత్ నిర్మాణానికి 15 లక్షల మంది తమ సూచనలు అందజేయగా.. 3 వేల సమావేశాలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, మహేశ్వర్రెడ్డి, రామారావు పటేల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. అదిలాబాద్ బహిరంగ సభ అనంతరం మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన మోదీ.. తిరిగి రాత్రి హైదరాబాద్కు చేరుకుని రాజ్భవన్లో బస చేశారు. మంగళవారం ఉదయం ఆయన సికింద్రాబాద్ మహంకాళి ఆలయాన్ని సందర్శించుకుని, అనంతరం సంగారెడ్డిలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.