PM Modi | హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాజకీయ బహిరంగ సభలకు జనం రావాలంటే పార్టీపైనో, నాయకుడిపైనో అభిమానం ఉండాలి. లేదంటే ఆ పార్టీ నాయకుడి వల్ల ఆ ప్రాంతానికి ఏదైనా మైలు జరిగి ఉండాలి. అప్పుడే అభిమానంతో ఆ పార్టీ బహిరంగ సభలకు జనం వస్తారు. కానీ, ఈ విషయంలో బీజేపీ రూటే సపరేటు. తమ సభలకు జనం రాకున్నా సరే.. లక్షలాదిమంది వచ్చారని చెప్పేందుకు ఆ పార్టీ పడే తంటాలు చూస్తే నవ్వు రాకమానదు. సినీ ప్రమోషన్ల తరహాలో తమ బహిరంగ సభలకు హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. ‘మేం లక్ష మందితో సభ నిర్వహిస్తున్నాం’ అని పాడిన పాటే పాడుతున్నది. మోదీ వచ్చినా, అమిత్ షా, నడ్డా.. ఇలా ఎంతమంది అగ్రనేతలు వచ్చినా సభకు వచ్చేది మాత్రం 10-15 వేలకు మించడం లేదు. ఈ విషయం ఆ పార్టీకి కూడా తెలుసు. ఇరుకు ప్రాంగణంలో సభ పెట్టి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి తమ సభకు జనం పోటెత్తినట్టు ప్రచారం చేసుకోవడం అలవాటైపోయింది.
జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం జూలై 3న హైదరాబాద్లోని పరేడ్గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరైన ఈ సభకు వచ్చింది 20 వేల లోపే. జాతీయ కార్యవర్గ సమావేశాలు కాబట్టి వారిలో ఎక్కువమంది ఇతర రాష్ర్టాల నేతలే ఉన్నారు. ఖమ్మంలో ఇటీవల జరిగిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు 7 వేల మంది మాత్రమే వచ్చినట్టు స్థానిక నేతలు చెబుతున్నారు. వాస్తవానికి ఈ సభ నాలుగైదు నెలల క్రితమే జరగాల్సి ఉండగా చివరికి జనం రారని తెలిసి సభను రద్దు చేశారు. ఆ తర్వాత పలు వాయిదాల అనంతరం చివరికి సభ జరిగినా ఉసూరుమనిపించింది. సభకు వచ్చిన జనాన్ని చూసి రాష్ట్ర నాయకత్వంపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 1న మహబూబ్నగర్లోని ఐటీఐ మైదానంలో సభ నిర్వహిస్తున్నారు. ఈ మైదానం విస్తీర్ణం దాదాపు 30 ఎకరాలు. ఇందులో హెలిప్యాడ్లు, అధికారిక కార్యక్రమాల ఏర్పాటు, ప్రధాని పాల్గొనే వేదిక వంటివాటికి 12-15 ఎకరాలు వినియోగిస్తున్నారు. ఇక మిగిలింది 15-18 ఎకరాలు మాత్రమే. ఇందులో సగం ప్రాంతంలో మాత్రమే బీజేపీ నేతలు టెంట్లు వేశారు. లక్ష మందిని తరలించి సభ నిర్వహిస్తామని కొన్నాళ్లుగా ప్రచారం చేస్తున్నా.. ఏర్పాట్లు మాత్రం 15వేల మందికి మించి లేవని స్థానిక నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా బీజేపీ నేతలు జనసమీకరణ చేసినా నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్నగర్, కల్వకుర్తి, గద్వాల నుంచి కొంతమేర వచ్చే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. అక్టోబర్ 3న నిజమాబాద్లో జరగనున్న బహిరంగసభలో మోదీ పాల్గొంటారు.
సభ జరగనున్న గిరిరాజ కాలేజీ మైదానం విస్తీర్ణం దాదాపు 18 ఎకరాలు. వేదిక ఏర్పాట్లు మినహాయిస్తే గరిష్ఠంగా ఈ మైదానంలో పట్టేది 20 వేల మందే. రోడ్డుపై నుంచి చూసేవారిని లెక్కవేసుకున్నా గరిష్ఠంగా 25 వేల మందికి మించి వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. 15వేల మంది వరకు వచ్చినా.. ఇరుకు ప్రాంగణం కాబట్టి వీడియోలు, ఫొటోల్లో బాగానే కనిపిస్తుందని సీనియర్ నేతలు సర్దిచెప్తున్నారట. ఎంపీ ధర్మపురి అర్వింద్ సొంత నియోజకవర్గం కావడంతో జన సమీకరణపై ప్రధానంగా దృష్టిపెట్టారు. అయితే ఇటీవల మండల అధ్యక్షుల మార్పుతో పలువురు కీలక నేతలు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. దీంతో ప్రజల్లో ధర్మపురి అర్వింద్పై వ్యతిరేకత పెరిగింది. ఇలాంటి సమయంలో జన సమీకరణ ఎలా చేయాలని నేతలు తలలు పట్టుకుంటున్నారు.